జేఈఈ మెయిన్లో మనోళ్ల సత్తా.. తెలంగాణ విద్యార్థి వివన్‌‌‌‌ శరద్‌‌‌‌ మహేశ్వరీకి 100 పర్సంటైల్

జేఈఈ మెయిన్లో మనోళ్ల సత్తా.. తెలంగాణ విద్యార్థి వివన్‌‌‌‌ శరద్‌‌‌‌ మహేశ్వరీకి 100 పర్సంటైల్
  •  
  • దేశవ్యాప్తంగా 12 మందికి 100 పర్సంటైల్..​ అందరూ అబ్బాయిలే
  • అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు స్టూడెంట్స్
  • జేఈఈ మెయిన్-2026 సెషన్ 1 ఫలితాలు విడుదల 

హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్–-2026 -(సెషన్1) ఫలితాల్లో తెలుగు స్టూడెంట్స్​ సత్తా చాటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు విద్యార్థులు100 పర్సంటైల్ సాధించారు. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లోని బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్​-–1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) సోమవారం రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే100 పర్సంటైల్ సాధించారు. ఇందులో తెలంగాణకు చెందిన వివన్ శరద్ మహేశ్వరీ ఉండగా, ఏపీకి చెందిన నరేంద్రబాబుగారి మహిత్, పాశల మోహిత్ కూడా 100 పర్సంటైల్ స్కోర్ చేశారు. వీరిలో నరేంద్రబాబుగారి మహిత్ దేశవ్యాప్తంగా ఓబీసీ కేటగిరీ టాపర్​గా, ఏపీకి చెందిన దేవ శ్రీవిద్(99.99 పర్సంటైల్) ఎస్సీ కేటగిరీ టాపర్​గా నిలిచారు. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు రికార్డు స్థాయిలో 13,55,293 మంది రిజిస్టర్ చేసుకోగా.. 13,04,653 మంది (96.26%) హాజరయ్యారు.  పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఎన్‌‌‌‌టీఏ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సీసీటీవీ సర్వైలెన్స్, ఏఐ టెక్నాలజీ, 5జీ జామర్లను వినియోగించింది. 


అయినా మాల్ ప్రాక్టీస్‌‌కు పాల్పడినట్లు గుర్తించిన 68 మంది విద్యార్థుల ఫలితాలను నిలిపివేసింది. మొత్తంగా 12 మంది టాపర్లలో రాజస్థాన్ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరు ఉండగా, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. ఈసారి 100 పర్సంటైల్ సాధించిన 12 మంది కూడా అబ్బాయిలే కావడం గమనార్హం. మరోపక్క బాలికల విభాగంలో హర్యానాకు చెందిన ఆషి గ్రేవాల్ 99.9969766 స్కోరుతో దేశవ్యాప్తంగా టాపర్‌‌గా నిలిచింది. కాగా, సెషన్ -2 పరీక్షల తర్వాత తుది ర్యాంకులను ప్రకటిస్తామని ఎన్‌‌టీఏ వెల్లడించింది.

వెబ్ సైట్​లో ఫైనల్​ కీ

జేఈఈ సెషన్ 1 ఎగ్జామ్స్ ఫైనల్​కీని సోమవారం ఉదయం ఎన్​టీఏ రిలీజ్ చేసింది. సాయంత్రం రిజల్ట్ విడుదల చేసింది.  https://jeemain.nta.nic.in వెబ్ సైట్​లో ఫైనల్​ కీతో పాటు రిజల్ట్​ను ఉంచారు. మెయిన్‌‌ స్కోర్‌‌ కార్డు డౌన్‌‌లోడ్‌‌ చేసుకునేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్‌‌ నంబర్‌‌, పాస్‌‌వర్డ్‌‌ ఎంటర్‌‌ చేయాల్సి ఉంటుంది. 

జేఈఈ మెయిన్​ 1కి హాజరైన  విద్యార్థులు 

కేటగిరీ           జనరల్    ఈడబ్ల్యూఎస్ఓ    బీసీ    ఎస్సీ    ఎస్టీ    మొత్తం 
అమ్మాయిలు    1,57,747    52,904    1,80,476    43,998    14,443    4,49,568 
అబ్బాయిలు    2,95,078    1,08,054    3,36,860    85,904    29,189    8,55,085 
మొత్తం            4,52,825    1,60,958    5,17,336    1,29,902    43,632    13,04,653