
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్టును టీడీపీ రెడీ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ 36 మందితో లిస్టు తయారు చేసి పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన సూచన మేరకు మరో నలుగురి పేర్లను చేర్చి 40 మంది అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేశారు. వీరి వివరాలను త్వరలో ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తొలి లిస్టులో10 మంది ముదిరాజ్ అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేసినట్టు తెలిసింది. లిస్టులో పేరున్న వారికి తమ నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని ఇప్పటికే సూచించినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను గత నెల 23వ తేదీనే ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ ఫస్ట్ లిస్టు విడుదల చేశాకే చేపట్టాలని పార్టీ అధినేత ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే లిస్టు విడుదలకు పార్టీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది.