బాలీవుడ్ యాక్షన్ స్టార్ అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'దృశ్యం3'. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ థ్రిల్లర్ సిరీస్ నుంచి లేటెస్ట్ గా ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు . ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే గత కొన్ని రోజులుగా నెట్టింట జోరుగా జరుగుతున్న ఒక ప్రచారనికి మాత్రం ఆయన తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
నేను ఎవరినీ రీప్లేస్ చేయడం లేదు!
నటుడు అక్షయ్ ఖన్నా ‘దృశ్యం 2’లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా అద్భుత నటనను కనబరిచారు. అయితే మూడవ భాగం నుంచి ఆయన వైదొలగడంతో ఆ పాత్రను ప్రకాష్ రాజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్.. “హిందీ ‘దృశ్యం 3’ షూటింగ్లో పాల్గొంటున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అద్భుతమైన టీమ్తో కలిసి ఒక పవర్ఫుల్ పాత్ర చేస్తున్నాను. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నట్టు.. 'నేను ఇక్కడ ఎవరినీ రీప్లేస్ చేయడం లేదు' అంటూ క్లారిటీ ఇచ్చారు. అంటే ఈ చిత్రంలో ఆయన ఒక సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టమైంది.
Started shooting for this engaging franchise #Drishyam3 in hindi. With a wonderful team and a scintillating role to play . Im sure you will love it . ❤️❤️❤️( and yes im not replacing anyone..) 😛😛😛
— Prakash Raj (@prakashraaj) February 10, 2026
అక్షయ్ ఖన్నా ఎగ్జిట్.. జైదీప్ అహ్లావత్ ఎంట్రీ
రెమ్యూనరేషన్ విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా అక్షయ్ ఖన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలోకి వర్సటైల్ యాక్టర్ జైదీప్ అహ్లావత్ వచ్చి చేరారు. అయితే, దర్శకుడు అభిషేక్ పాఠక్ కథలో మార్పులు చేసి, జైదీప్ కోసం ఒక కొత్త క్యారెక్టర్ను డిజైన్ చేసినట్లు సమాచారం.. విజయ్ సల్గాంకర్ (అజయ్ దేవగన్) తెలివితేటలకు చెక్ పెట్టేలా ఈ కొత్త పాత్రలు ఉండబోతున్నాయని టాక్ వినిపిసతోంది..
రిలీజ్ డేట్
భారీ అంచనాలతో ఈ ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ అక్టోబర్ 2, 2026న విడుదల కానుంది. విజయ్ సల్గాంకర్ ఫ్యామిలీ 'అక్టోబర్ 2'న పంజీకి వెళ్లిన కథాంశంతో ఈ తేదీకి విడదీయలేని సంబంధం ఉంది. టబు, శ్రియా శరణ్, రజత్ కపూర్, ఇషితా దత్తా వంటి ప్రధాన తారాగణం ఈ సీక్వెల్లోనూ కొనసాగుతున్నారు. మరో వైపు మలయాళ వెర్షన్ లో మోహన్లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒరిజినల్ మలయాళ ‘దృశ్యం 3’ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇది ఏప్రిల్ 2, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఒకవైపు మలయాళం, మరోవైపు హిందీలో ఏకకాలంలో సంచలనం సృష్టిస్తున్న ఈ ఫ్రాంచైజీ, మూడవ భాగంతో ఏ స్థాయిలో థ్రిల్ ఇస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజ నటుడు తోడవ్వడంతో ‘దృశ్యం 3’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. భాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డు సృష్టించబోతుందో చూడాలి మరి.
