- 2030 నాటికి తీర్చిదిద్దేలా సమగ్ర రోడ్ మ్యాప్: మంత్రి శ్రీధర్ బాబు
- ఆదిబట్లలో టాటా, సాఫ్రాన్ కలిసి తయారీ యూనిట్ ప్రారంభించిన మంత్రి
- రూ.425 కోట్ల పెట్టుబడి.. 500 మందికి ఉద్యోగాలు
హైదరాబాద్, వెలుగు: ఏరో స్పేస్లో కొత్త పెట్టుబడులు వచ్చేలా సమగ్రమైన రోడ్మ్యాప్ను తయారు చేస్తున్నామని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2030 నాటికి రాష్ట్రాన్ని దేశానికి ఏరో ఇంజిన్ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ కలిసి రూ.425 కోట్లతో ఆదిబట్లలో ఏర్పాటు చేసిన ‘ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపొనెంట్స్’ తయారీ యూనిట్ను మంగళవారం ఆయన హైటెక్ సిటీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్లోబల్ ‘ఏరోస్పేస్- డిఫెన్స్ స్పేస్’ హబ్ గా తెలంగాణను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. హైదరాబాద్ అంటే కేవలం ముత్యాల నగరమే (సిటీ ఆఫ్ పెరల్స్) కాదని, ప్రొపల్షన్, ప్రెసిషన్, ప్రోగ్రెస్ నగరంగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల ఎగుమతులు 2023–24లో రూ.15,900 కోట్లు ఉండగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరిగాయన్నారు. ఇవి కేవలం అంకెలు మాత్రమే కాదని, తమ ప్రభుత్వ హయాంలో ఈ రంగం సాధించిన వృద్ధి రేటుకు నిదర్శనమన్నారు.
ఈ కొత్త తయారీ యూనిట్లో ఎయిర్బస్, బోయింగ్ సంస్థలు లీప్ ఇంజన్ల తయారీలో వినియోగించే బేరింగ్ హౌసింగ్ (స్టేషనరీ కాంపోనెంట్)లో ప్రెషర్ టర్బైన్ షాఫ్ట్ (రోటేటివ్ కాంపోనెంట్) తయారవుతాయన్నారు. ఫలితంగా తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవ్వడంతో పాటు కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. విమాన ప్రయాణ భవిష్యత్తును నిర్మించాలనుకుంటే దానిని తెలంగాణలో నిర్మించాలంటూ అంతర్జాతీయ ఏరో స్పేస్ సంస్థలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఇంజిన్స్, కాంపోనెంట్స్, ఎమ్మార్వో, కన్వర్షన్స్, స్పేస్, డ్రోన్స్, డిజిటల్, ఏఐ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈవో, ఎండీ సుకరన్ సింగ్, ఈడీ మసూద్ హుస్సేన్, సాఫ్రాన్ ఏయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ వైస్ ప్రెసిడెంట్ డొమినిక్ డూప్, టీజీఐఐసీ ఎండీ శశాంక, తెలంగాణ ఏరో స్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
