- దేశమంతా తెలంగాణ రోడ్ల గురించే మాట్లాడుతరు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- హ్యామ్రోడ్లకు త్వరలోనే టెండర్లు ఖరారు
హైదరాబాద్, వెలుగు: రాబోయే రెండేండ్లలో రాష్ట్రంలో అద్భుతమైన రోడ్లను నిర్మిస్తామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. 2028 జూన్ నాటికి దేశంలో రోడ్లు అంటే అందరూ తెలంగాణ వైపు తిరిగి చూసేలా నిర్మిస్తామని చెప్పారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి వెంకట్రెడ్డి సమాధానమిచ్చారు. ‘‘ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకానికి 11 వేల కోట్లు చెల్లించాం. యంగ్ ఇండియా స్ఫూర్తితో 20 వేల కోట్లతో ఇంటర్నేషనల్ మోడల్ స్కూళ్ల నిర్మాణం చేపట్టినం’’ అని మంత్రి వివరించారు.
తాము పునరుద్ధరిస్తున్న అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ సభ్యులు ధన్యవాదాలు చెప్పాలన్నారు. ‘‘మా శాఖకు సాధారణ బడ్జెట్ తక్కువగా ఉంది. దీనికి తోడు మా శాఖపై ఉన్న 4,600 కోట్ల బకాయిలను కొద్ది కొద్దిగా చెల్లిస్తూ వస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సూచించిన సిద్దిపేట రింగురోడ్డుతో పాటు గజ్వేల్ రింగురోడ్డునూ పూర్తి చేస్తం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా.. మేం మాత్రం పూర్తిచేసే తీరుతాం.
మా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు రోడ్ల అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టింది”అని చెప్పారు. హ్యామ్రోడ్ల ప్రణాళికలకు సంబంధించి టెక్నికల్ ఎవల్యూషన్ పూర్తయిందన్నారు. 8 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన హ్యామ్ మోడల్లోనే, అవే గైడ్ లైన్స్తో ఈ రోడ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. దాదాపు 15 ఏండ్ల మెయింటెనెన్స్కాంట్రాక్టర్చేసే ఒప్పందంతో ఈ రోడ్లు నిర్మించబోతున్నామని, ఆమోదించిన 15 రోజుల్లో పనులు మొదలు పెడ్తామని మంత్రి వెల్లడించారు.
