- కేసీఆర్ నిర్వాకం వల్లే హామీల అమలు లేటు
- రేపోమాపో కేటీఆర్, కవిత జైలుకు పోతరు
- జగదీశ్రెడ్డి సహా తప్పు చేసినోళ్లందర్నీ జైలులో వేస్తం
- మేమొచ్చి 47 రోజులే.. బీఆర్ఎస్ నేతలకు ఓపిక లేకుంటే ఎట్ల?
- కేటీఆర్, హరీశ్, సంతోష్ మంచి డాక్టర్కు చూపెట్టుకోవాలని కామెంట్
హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల నుంచే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్ హామీలను అమలు చేయబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీల్లో రెండు హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హామీల అమలుపై రివ్యూ చేశామని, వంద రోజుల్లో గ్యారంటీలన్నీ అమలు చేస్తామన్నారు. ఫ్రీ కరెంట్ను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అమలు చేసేవాళ్లమని, కానీ, ఖర్మ కొద్దీ విద్యుత్ డిపార్ట్మెంట్లో ప్రభాకర్ రావు అనే 82 ఏండ్ల ‘ముసలి యంగ్’ అధికారిని కేసీఆర్ పెట్టుకున్న ఫలితంగానే అమలు చేయలేకపోయామని పేర్కొన్నారు. ఆయన వల్ల విద్యుత్ డిపార్ట్మెంట్ రూ.70 వేల కోట్ల నష్టాలబారిన పడిందన్నారు. చత్తీస్గఢ్ కరెంట్ను కొనుగోలు చేస్తూ యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాన్ని నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చి నష్టాలకు కారణమయ్యారన్నారు. సీఎం రేవంత్ మీటింగ్కు పిలిచినా ప్రభాకర్ రావు రాలేదని, తప్పు చేసినోళ్లు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని పోలీసులు జైలులో వేస్తారన్నారు. జగదీశ్ రెడ్డిని కూడా వదిలిపెట్టేది లేదన్నారు. రేపోమాపో కేటీఆర్, కవిత జైలుకు పోతారని అన్నారు.
వచ్చే టర్మ్లో వంద గెలుస్తం
ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే పది సీట్లలో ఓడిపోయామని, మంచి పనులు చేసి వచ్చే టర్మ్లో వంద సీట్లకుపైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 13 నుంచి 14 లోక్సభ స్థానాలను గెలుచుకుంటామన్నారు. బీఆర్ఎస్ ఎక్కడా పోటీలోనే ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 47 రోజులే అవుతున్నదని, ఇంత ఓపిక లేకుంటే ఎట్ల అని బీఆర్ఎస్ నేతలపై వెంకట్రెడ్డి ఫైరయ్యారు. 120 నెలల పాటు బీఆర్ఎస్ సర్కారును ప్రజలు ఎట్లా భరించారో గుర్తు చేసుకోవాలని సూచించారు.
వంద కాదు.. 200 అడుగుల లోతులో పాతేస్తం
బీఆర్ఎస్ వాళ్ల దోపిడీకి వంద అడుగులు కాదు.. రెండు వందల అడుగుల లోతులో పాతేసినా పాపం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతల దోపిడీ వల్లే మూడేండ్లు కాకముందే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టి 70 ఏండ్లు అవుతున్నా ప్రాజెక్టుకు ఒక్క చిన్న గీత కూడా పడలేదన్నారు. కేటీఆర్, హరీశ్, సంతోష్.. మెంటల్హాస్పిటల్లో చేరుతారన్న అనుమానం కలుగుతున్నదని, ఆలోపే మంచి డాక్టర్కు చూపించుకోవాలన్నారు. ఎమ్మెల్యేలను కొనే దరిద్రపు అలవాటున్న బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు, ఏడాది మాత్రమే ఉంటుందంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తాము అలా చేయాలనుకుంటే ఆ పార్టీలో కేటీఆర్, హరీశ్ తప్ప ఇంకెవరూ మిగలరన్నారు. తమ పార్టీలో కోవర్టు ఆపరేషన్ ఏమీ లేదని, కేటీఆర్, హరీశ్ లే కడుపులో కత్తులు పెట్టుకుని పోట్లాడుకుంటున్నారన్నారు. రేవంత్ నాయకత్వంలో తామంతా కలసికట్టుగా పనిచేస్తున్నామన్నారు.
రాష్ట్రం గుల్ల అయింది.. గాడిన పెడుతున్నం
కేసీఆర్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దివాలా తీసిన విద్యుత్ శాఖను గాడిలో పెడుతున్నామన్నారు. అందుకే హామీల అమలులో కొంత ఆలస్యమవుతున్నదని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వరకు అన్ని హామీలను బీఆర్ఎస్ సర్కారు విస్మరించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ లీడర్లలాగా తాము ప్రజలను రెచ్చగొట్టి ఉంటే కేసీఆర్ ఫామ్హౌస్దాటి ఉండేవారు కాదన్నారు. కాళేశ్వరంతోపాటు అన్ని అక్రమాలపైనా విచారణ జరుగుతున్నదని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఊర్లల్ల ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకముందే ఏ మొహం పెట్టుకుని ప్రశ్నిస్తున్నారని కేటీఆర్పై మండిపడ్డారు.