- నిబంధనల అమలు, ప్రమాదాల నివారణే లక్ష్యం
హైదరాబాద్, వెలుగు: కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇప్పటికే ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్న అధికారులు..త్వరలోనే ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో సమావేశం కావాలని నిర్ణయించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రైవేటు బస్సులలో రవాణా శాఖ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడమే లక్ష్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని బస్సు ఆపరేటర్లకు పలు సూచనలు చేసేందుకు వీలుగా త్వరలోనే సమావేశం కానున్నారు. ప్రమాదాల నివారణ కోసం సాంకేతికతతో కూడుకున్న పలు వీడియోలను ఇందులో ప్రదర్శించి, వారికి కౌన్సిలింగ్ చేసే ఏర్పాట్లలో ఆర్టీఏ అధికారులు ఉన్నారు.
