
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్ర సర్కారు గాలికి వదిలేసింది. వర్సిటీ వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్త లంచం తీసుకుంటూ నాలుగు రోజుల కింద ఏసీబీకి పట్టుబడి జైలుపాలయ్యారు. అయితే.. ఇప్పటివరకూ ఎవరికీ ఇన్చార్జ్ వీసీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించలేదు. వర్సిటీలో కొన్నాళ్లుగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను కూడా చక్కదిద్దేందుకు ప్రయత్నించడం లేదు. ఫలితంగా స్టూడెంట్లు, ప్రొఫెసర్లు ఆందోళనకు గురవుతున్నారు.
ఏడాదిన్నరగా వివాదాలే
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి వైస్ చాన్స్లర్గా రవీందర్ గుప్త బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తరచూ వర్సిటీ వార్తల్లో ఉంటున్నది. ఏడాదిన్నర నుంచి వీసీపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అనేకసార్లు మంత్రులను, ఉన్నతాధికారులను స్టూడెంట్ యూనియన్ లీడర్లు కలిసి.. విచారణ జరిపించాలని వినతిపత్రాలు ఇచ్చారు. వర్సిటీలో నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయినా, సర్కారు పెద్దగా పట్టించుకోలేదు.
చివరికి వర్సిటీ రిజిస్ట్రార్ నియామకంలో కాలేజీ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కు, వీసీ రవీందర్ గుప్తకు మధ్య భేదాభిప్రాయాలు రావడం, వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ)లో పలుమార్లు గొడవలు జరగడంతో వివాదం మరింత ముదిరింది. దాదాపు రెండు, మూడు నెలలుగా వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులకు, వీసీకి మధ్య పడటం లేదు. ఇదే టైమ్లో గత శనివారం పరీక్ష కేంద్రం కోసం ఓ ప్రైవేటు కాలేజీ మేనేజ్మెంట్ నుంచి వీసీ రవీందర్ గుప్త రూ. 50 వేల లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.
ఇస్తే ఎవరికి ఇస్తరు?
ఏసీబీకి చిక్కి జైల్లో వీసీ రవీందర్ గుప్త ఉండగా.. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ ప్రభుత్వం నియమించలేదు. ఇన్చార్జ్గా కూడా ఎవరికి బాధ్యతలు అప్పగించలేదు. ఒక వేళ బాధ్యతలు అప్పగిస్తే ఎవరికి అప్పగిస్తారనే దానిపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వర్గాల్లో పలువురి పేర్లు చర్చకు వస్తున్నాయి. ఇన్చార్జ్ వీసీగా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రిని కానీ, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ వెంకటరమణను కానీ నియమించే అవకాశం ఉందని ఆ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రభుత్వం వెంటనే ఇన్చార్జ్ వీసీని గానీ, పూర్తికాలపు వీసీని గానీ నియమించాలని వర్సిటీ స్టూడెంట్లు, ప్రొఫెసర్లు కోరుతున్నారు. వర్సిటీలోని పరిస్థితులను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని
గుర్తుచేస్తున్నారు.