- గ్లోబల్ సమిట్లో కర్నాటకడిప్యూటీ సీఎం డీకే శివకుమార్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విజన్ అద్భుతమని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రశంసించారు. చాలామంది హైదరాబాద్, బెంగళూరు నగరాలను పోటీదారులుగా చూస్తుంటారని, కానీ తాము పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్తామని తెలిపారు.
సోమవారం ‘తెలంగాణ రైజింగ్ సమిట్’లో డీకే శివకుమార్ మాట్లాడారు.‘‘మేం పోటీదారులం కాదు.. ఒకరికొకరం సహకరించుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ బలమైన భారతదేశాన్ని, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించే భాగస్వాములం”అని పేర్కొన్నారు.
దేశ సాంకేతిక ప్రగతి గురించి మాట్లాడేటప్పుడు బెంగళూరు, హైదరాబాద్ ప్రస్తావన లేకుండా అది అసంపూర్ణమని, ఈ రెండు నగరాలు కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. ‘‘వేగంగా వెళ్లాలంటే ఒంటరిగా వెళ్లు..కానీ చాలా దూరం వెళ్లాలంటే మాత్రం అందరితో కలిసి వెళ్లు”అని రతన్టాటా చెప్పిన సూత్రాన్ని పాటిస్తూ, ఈ రెండు నగరాలు కలిసి ప్రయాణించాలని ఆకాంక్షించారు.
పదేండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చిన తెలంగాణ ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బృందంపై ఉంచిన నమ్మకాన్ని వారు వమ్ము చేయరని, ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి ఏం కావాలో అది కచ్చితంగా అందిస్తారని తెలిపారు.

