తొమ్మిదేండ్ల తెలంగాణ దగా పడ్డది

తొమ్మిదేండ్ల తెలంగాణ దగా పడ్డది

ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న దృఢ సంకల్పంతో నాటి పోరాటంలో ముక్కోటి గొంతుకలు ఒక్కటై దిక్కులు పిక్కటిల్లేలా, పాలకుల గుండెలు అదిరిపోయేలా గర్జించిన రణ నినాదం జై తెలంగాణ. అనుకున్నట్టుగానే, తెలంగాణ ప్రజానీకం ఆశించిన విధంగా రాష్ట్రం సాకారమైంది. చూస్తుండగానే తొమ్మిదేండ్లు గడిచాయి. ఇప్పుడు మనం చాలా ముందుకు వచ్చాం. ఇక ఒక్క అడుగు ఆగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. పదేళ్ల తెలంగాణలో దండుకున్నది ఎవరు? దగా పడ్డది ఎవరో తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ ఉద్యమంలో కలాలను, గళాలను, హలాలను, ఒక్కటిగా చేసి ఉద్యమంలో భాగస్తులను చేసింది జర్నలిస్టులు. అన్ని సమస్యలకు తెలంగాణ ఒక్కటే పరిష్కార మార్గమని అందుకోసం అలుపెరుగని పోరాటం అవసరమని భావించాం.

మనం ఏది అనుకున్నామో, ఏమి ఆలోచించామో ఆ భావాలన్నింటినీ ప్రజలపై రుద్దాం. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఒక ఆకర్షణీయ నినాదాన్ని తయారుచేసి ఉద్యమకారులకు అందించాం.1969 నుంచి పోరాటం ఉన్నా దానికి రాజకీయ ఆలోచన లేని కారణంగా అది అణిచివేయబడిందని భావించాం. అధికారం కోసం, అందలం కోసం కాచుకుని కూర్చున్న ఓ ప్రాణికి బలాన్ని ఇచ్చాం. బలవంతుడిని చేశాం. ఉద్యమ నినాద మంత్రాన్ని ఉపదేశించి తెలంగాణ బాహుబలిని చేశాం. ఉద్యమకారులుగా మనకు ఎన్ని అవమానాలు ఎదురైనా, తెలంగాణ కోసం అన్నింటినీ దిగమింగి మన అందరి బలాన్ని ఒక్కనికే ఇచ్చి, మన మస్తిష్కాన్ని రంగరించి ఆయనకు మేధస్సును ఇచ్చాం.

జర్నలిస్టులకు దక్కిన గౌరవం ఏది?

శిలను చెక్కి శిల్పం చేశాం. అది రాయి కాదు రత్నం అని మనమే ప్రజలను నమ్మించాం. తెలంగాణ అన్న పదం పలకరాని వ్యక్తిని తెలంగాణ భాషకే పట్టాభిషిక్తుణ్ని చేశాం. తెలంగాణ యాసలో ఆయనను మించినోడు లేడని మనమే ప్రచారం చేశాం. భస్మాసురుడికి శివుడు వరమిచ్చినట్లుగా తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు అందరం కలిసి తెలంగాణపైకి ఓ భస్మాసురుడిని వదిలిపెట్టాం. ఇప్పుడు ఆ భస్మాసురుడి నుంచి రక్షణ కోసం నలుదిక్కుల పరిగెడుతున్న పరిస్థితి కనబడుతున్నది. అందుకే ఒక్క అడుగు ఆగి వెనక్కి చూసుకొని ఇప్పుడేం చేద్దామని ఆలోచించుకొని సంఘటితంగా ముందడుగు వేయడం కోసం చర్చలు జరపాల్సిన సమయం ఆసన్నమైంది. అభివృద్ధి కంటే ఆత్మగౌరవమే మిన్న అంటూ, ఎన్నో మాటలు చెప్పి ఆత్మగౌరవ తెలంగాణ కోసమే పోరాటమని చెప్పాం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్టులకు దక్కిన గౌరవంలో ఆవగింజంతైనా ఇప్పుడు దక్కుతోందా ఆలోచిద్దాం రండి. 

ఆత్మహత్యలు ఆగినయా?

నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయి? ఎవరి పాలయ్యాయి? ఎందుకిలా జరిగింది? ఇవన్నీ ఇప్పుడు ముఖ్యమే. 9 ఏండ్ల తర్వాత కూడా వీటి గురించి ఆలోచించకపోతే మనం తెలంగాణ ద్రోహులమవుతాం. దండుకున్నోడు దండుకొని పోతుంటే మనం దగాపడ్డ జనం పక్షాన నిలవాల్సి ఉంది. ఎందుకంటే దగాపడ్డ జనంలో మనమూ ఉన్నాం. దశాబ్ది పండుగ ఉత్సవంలా జరుపుతామని ప్రభుత్వం అంటుంది. నిజంగా ప్రజలు ఉత్సవం చేసుకునే ఆనందంలో ఉన్నారా? రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగుల బలవన్మరణాలు ఆగాయా? వందలాదిమంది ఉద్యమకారుల బలిదానం మూలంగా ఏర్పడ్డ తెలంగాణ ఏ ఒక్కరి సొత్తు కాకూడదని తెలంగాణ ప్రజలందరికీ ఫలితం దక్కాలని ఆలోచిస్తే ఆ వైపుగా అడుగులు వేస్తే ఇనుప సంకెళ్లు పోలీస్ లాఠీలు సమాధానాలు ఇస్తున్న ఈ పరిస్థితులు ఎమర్జెన్సీకి భిన్నంగా ఏమాత్రం కనిపించడం లేదు. ఎవరికివారుగా మనకెందుకులే అని కూర్చుంటే తెలంగాణ ప్రజానీకంలో పుట్టబోయే బిడ్డ కూడా అప్పుతోనే జన్మనిస్తుంది. చనిపోయి శవంగా మారిన ఆ శవం కూడా లక్షన్నర అప్పును మోస్తూనే ఉంది. చావు కాడ, బతుకు కాడ ఒక్కటే పాట అన్నట్టు ప్రభుత్వం అన్నింటికీ కాళేశ్వరాన్ని చూపించి ప్రపంచం కండ్లు కప్పడానికి ప్రయత్నిస్తున్నది. అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాలు, 100 అడుగుల వెడల్పు రహదారులు కాదు. ప్రజల జీవనంలో మౌలిక మార్పులు సంభవించి ఉత్పాదకత పెరిగి, స్వయం సమృద్ధి సాధించడం. ఇవేవీ ఇప్పుడు తెలంగాణలో మచ్చుకైనా కనిపించడం లేదు.

కంపెనీల్లో కొలువులెవరికి?

కేటీఆర్ చెప్పే కంపెనీల పేర్లు ఆకర్షణీయంగా ఉన్నా, ఆశలు కల్పిస్తున్నా, ఈ ప్రాంత ప్రజానీకానికి ఎన్ని ఉద్యోగాలు దక్కాయో ఎవ్వరికీ అర్థం కాదు. నాటి నిజాంలు నగరం చుట్టూ వదిలి వెళ్లిన వేలాది ఎకరాల భూములు ఈ నయా నిజాంల పాలైపోయాయి. నాటి పాలకుల ముందుచూపు నేటి పాలకులకు కాసుల పంట పండిస్తున్నది. కంపెనీల పేరుతో వందలాది ఎకరాల భూమిని వారికి కావాల్సిన వాళ్లకు కట్టబెట్టి కమీషన్లు దండుకునే దుష్ట సంస్కృతి నెలకొంది తెలంగాణలో.  ఎన్నో ఆశలతో స్వరాష్ట్ర పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులు ఎటూ కాకుండా పోయారు. ఉద్యమ ద్రోహులే అందలం ఎక్కి ఉద్యమకారుల తలలపై నాట్యమాడుతుంటే ఇంకా ఇలానే చూస్తూ కూర్చుందామా? ఇంకా చూస్తూ కూర్చుంటే మరో ఐదేండ్లు ఈ ప్రభుత్వమే గద్దెనెక్కితే ఇక తెలంగాణలో మిగిలేది ఏముంటుంది? తెలంగాణే కుటుంబ సంపదగా మారుతుంది. 
అందరం కలవాలి, ఆలోచించాలి. పదేళ్ల తెలంగాణలో దండుకున్నది ఎవరు? దగా పడ్డది ఎవరు? తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి మరో పోరాటం అవసరమవుతున్నది. అందుకే మళ్లీ జేఏసీ పురుడు పోసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అనిపిస్తున్నది. ఉద్యమకారులారా ఆలోచించండి.

పథకాలు, ప్రాజెక్టులు..

ఓటు కోసం నోటు ఇస్తున్న తీరు మారి ఓట్ల కొనుగోలు కోసం కొత్త పథకాలను ప్రవేశపెట్టే తీరు తెలంగాణలో మొదలైంది. దళిత బంధులో 30% కమిషన్ కొందరు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నట్టు స్వయంగా సీఎం ప్రకటించినా ఇంకా ఆ ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇదొక్కటే కాదు ప్రభుత్వ ప్రతి పథకంలో ఆమ్యామ్యాలు లేనిదే ఏ లబ్ధిదారుడికి సహకారం అందడమే లేదు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్​లో పరిస్థితిని ఒక్కసారి పరిశీలిస్తే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం లక్షల రూపాయలు వసూలు చేసిన అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.

వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం ఉన్నా అందులో డాక్టర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. అందమైన భవనాల్లో హాస్టళ్లు, స్కూళ్లు ఉన్నా ఉన్నత విద్య అందడమే లేదు. నియోజకవర్గం చుట్టూ కాలువలు పరుచుకొని ఉన్నా ఏ ఒక్క ఎకరానికీ కాళేశ్వరం నీళ్లు అందనే లేదు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల బాధితులకు ఇప్పటివరకు పూర్తి పరిహారం అందలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి సమాధి కట్టబడ్డది. మూడు ఎకరాల భూమి ఊసే లేదు. ధరణి పథకం పేరుతో పేదల భూములన్నీ పెద్దలపరమైపోయాయి.
-  కప్పర ప్రసాద్​రావు, సీనియర్ ​జర్నలిస్ట్