కోరుట్ల, వెలుగు: సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, పర్సంటేజీల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పనులు చేపట్టి , మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా గోస -బీజేపీ భరోసా యాత్ర బైక్ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఐబీ గెస్ట్ హౌజ్లో విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వంద రోజుల్లో ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు రైతులను మోసం చేశాడన్నారు. మిషన్ భగీరథ పనులతో రోడ్లు తవ్వి అధ్వానంగా తయారు చేశారని, కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఇస్తే పేదలకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు.
ఇంటికో ఉద్యోగం పేరిట ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. ట్రిబుల్ఐటీ, గురుకులాల్లో స్టూడెంట్లకు సరైన భోజనం పెట్టకుండా దాదాపు 460 మంది ఫుడ్పాయిజనింగ్కు కారణమయ్యారన్నారు. రైతు వేదికలు, శ్మశానవాటికలు, సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టినవేనని, కానీ తామే కట్టినట్లు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ పైడిపల్లి సత్యనారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాంబారి ప్రభాకర్, మాజీ జడ్పీ చైర్పర్సన్తుల ఉమ, నియోజకవర్గ ఇన్చార్జి డా. వెంకట్ తదితరులు పాల్గొన్నారు.