ఫిలిం ఛాంబర్లో ఎన్నికలు.. దిల్ రాజు, సి కళ్యాణ్ మధ్య రసవత్తర పోటీ

ఫిలిం ఛాంబర్లో ఎన్నికలు.. దిల్ రాజు, సి కళ్యాణ్ మధ్య  రసవత్తర పోటీ

తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రముఖ నిర్మాతలు దిల్‌ రాజు, సి కల్యాణ్‌ ప్యానెల్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. గత వారంరోజులుగా హోరాహోరీగా సాగిన ప్రచారానికి తెరపడగా.. జులై 30 ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు ఈ ఎన్నికలు మొదలవనుండగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. అదేరోజు నాలుగు గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించి.. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు

ఇక ఫిలిం ఛాంబర్‌ కామర్స్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో అనే నాలుగు సెక్టార్స్ ఉన్నాయి. ఛాంబర్లో మొత్తం 1500 మంది సభ్యులుండగా.. దాదాపు 900 మంది వోటింగ్ లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా..  తెలుగు ఫిలిం ఛాంబర్‌ కామర్స్‌ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న నిర్మాత దిల్‌ రాజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న సభ్యులు నా ప్యానెల్లో ఉన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో 4 విభాగాల సభ్యులు పాల్గొంటారు. ఆ నాలుగు విభాగాల్లో సమస్యలున్నాయి. ముఖ్యంగా నిర్మాతలకు, ఎగ్జిబిటర్స్‌కు సమస్యలు ఎక్కువ. వాటిని పరిష్కరించేందుకు కొన్ని కొత్త ఐడియాలతో మా ప్యానెల్‌ ముందుకు వస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీని మేమందరం ఐక్యతతో  ముందుకు తీసుకెళ్తాము' అని పేర్కొన్నారు దిల్‌ రాజు.