హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ప్రముఖ తెలుగు రచయిత లోక మలహరి రచించిన అంటరాని విద్య , సంగం పుస్తకాలను బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ నవలలను డా. సుమేధ ద్యావనపల్లి ఇంగ్లిష్లోకి అనువదించగా, తెలంగాణ పబ్లికేషన్స్ ప్రచురించింది. సమ్మక్క–సారక్క కేంద్ర గిరిజన యూనివర్సిటీ వీసీ వై.ఎల్. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక మలహరి రచించిన జెగ్గని యిద్దె , సంఘం నవలలు.. సామాజిక విమర్శకు, నైతిక విచారణకు సాహిత్యాన్ని సాధనంగా ఉపయోగించిన భారతీయ సాహిత్య సంప్రదాయానికి ఈ నవలలు చెందుతాయని, ముల్క్ రాజ్ ఆనంద్, ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి సంస్కరణవాద రచయితల కథన సంప్రదాయానికి ఇవి వారసులని పేర్కొన్నారు.
గ్రామీణ భారతదేశంలో కులపీడన, సామాజిక బహిష్కరణ, మానవ గౌరవం కోసం సాగిన పోరాటాలను ఈ నవలలు స్పష్టంగా, హృద్యంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బి.ఎస్. రాములు అధ్యక్షత వహించగా, సాహితీవేత్తలు మణికొండ వేదకుమార్, సంగిశెట్టి శ్రీనివాస్, పిల్లలమర్రి రాములు, సునీత , అనువాదకురాలు డా. సుమేధ ద్యావనపల్లి, పబ్లిషర్ కోయ చంద్రమోహన్ పాల్గొన్నారు.
