
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఎండోమెంట్ అధికారులు దీనిపై దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణ పండుగలు, సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో మంత్రి సురేఖ ఎండో మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ అనుమతులు, సీజీఎఫ్ నిధుల కోసం వచ్చిన విజ్ఞప్తులపై వివరాలు తెలుసుకున్నారు.
రూ.72.47 కోట్లతో 297 పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. దేవాలయాల సమగ్ర అభివృద్ధికి సీజీఎఫ్ నిధులను పారదర్శకంగా వినియోగించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఈవోలు పాటించాలని, సీజీఎఫ్ పనులపై నిర్లక్ష్యం సరికాదన్నారు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి ఎస్టిమేషన్స్ ఎంత వస్తే అంత పంపకూడదని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అంచనాలు రూపొందించి పంపించాలని కోరారు.
టెంపుల్ టూరిజం డెవలప్ మెంట్లో భాగంగా ఒక జిల్లాలో మూడు ప్రధాన ఆలయాలను కలిపి ఒక సర్య్కూట్గా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను మూడు విడతల్లో చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రముఖ ఆలయాలకు భక్తులు, పర్యాటకులను తీసుకెళ్లడంతోపాటు మార్గమధ్యలో ఉన్న పర్యాటక ప్రాంతాలు సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఈ సారి వరంగల్ భద్రకాళి ఆలయంలో బోనాలు ఘనంగా నిర్వహించాలన్నారు.