
కోహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో అప్పుల బాధతో కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని ఆరేపల్లి పరిధి చంద్రనాయక్ తండాకు చెందిన బానోతు రమేశ్(24) ఈయేడు 4 ఎకరాలు కౌలుకు తీసుకొని రెండెకరాల్లో పత్తి, మరో రెండు ఎకరాల్లో వరి వేశాడు. వర్షాలకు పత్తి పంట బాగా దెబ్బతినగా.. వరి పంట కూడా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. వీటికి తోడు కుటుంబాన్ని పోషించేందుకు ఫైనాన్స్లో ఆటో తీసుకున్నాడు. దాదాపు రూ.4 లక్షల వరకు అప్పు అయింది. ఇటు పంటలు పండకపోగా, అటు కిస్తీ కట్టడం లేదని ఆటోను ఫైనాన్స్వారు తీసుకెళ్లారు. అప్పు తీర్చే మార్గం కనిపించక ఈ నెల 3న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని సిద్దిపేట సర్కారు దవాఖానకు, అక్కడి నుంచి గాంధీకి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పవన్ కుమార్ తెలిపారు.