హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం (అక్టోబర్ 16న) సవాల్ చేసిన విధంగానే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. రేవంత్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రికత్త ఏర్పడింది.
పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే... రిటర్నింగ్ అధికారి పర్మిషన్ కావాలని పోలీసులు రేవంత్ రెడ్డిని అడిగారు. ఆ తర్వాత రేవంత్తో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణి చేయకుండా ఎన్నికలు వెళ్లేందుకు సిద్ధమా...? అని సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తన అనుచరులతో కలిసి గన్ పార్క్ వద్దకు వెళ్లారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.