
- హడావుడిగా కాలేజీలు ప్రారంభించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం
- బిల్డింగులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీల కొరత
- టీచింగ్ స్టాఫ్ దొర్కక స్టూడెంట్లకు తిప్పలు
- ఒక్క కాలేజీలోనూ 60 శాతం దాటని అటెండెన్స్
- పర్మిషన్ రద్దు చేస్తామని హెచ్చరిస్తున్న ఎన్ఎంసీ
హైదరాబాద్, వెలుగు: మెడికల్ కాలేజీలను కాపాడుకోవడం కాంగ్రెస్ సర్కారుకు సవాలుగా మారింది. బిల్డింగులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరిపడా ఫ్యాకల్టీ లేకుండానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేండ్లలోనే 17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఇంకో 8 మెడికల్ కాలేజీలకు దరఖాస్తు చేసింది. మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు విపరీతంగా పెరిగాయి. కాలేజీలు అశాస్త్రీయంగా పెంచుతున్నారని, మెడిసిన్ విద్య నాసిరకంగా తయారవుతోందన్న విమర్శలు ఎదురయ్యాయి.
దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ).. కాలేజీల్లో ఫ్యాకల్టీ అటెండెన్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ను తీసుకొచ్చింది. నిరుడు తెచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం మెడికల్ కాలేజీల్లో 75 శాతం అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలి. మన దగ్గర కాలేజీల సంఖ్య ఒక్కసారిగా పెరగడం, ఫ్యాకల్టీ కొరత, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో పనిచేయడానికి డాక్టర్లు ఇష్టపడకపోవడం వంటి కారణాలతో హాజరుశాతం సరిగా నమోదవడం లేదు.
ఉన్నతాధికారులు ఎంత చెప్పినా కొంత మంది ప్రొఫెసర్లు లైట్ గా తీసుకుంటున్నారు. వారానికోసారి, పది రోజులకు ఓసారి కాలేజీలకు పోయేవాళ్లు కూడా తయారయ్యారు. ఈ వ్యవహారంతో కాలేజీల అటెండెన్స్ దెబ్బతింది. దీంతో ఆగ్రహించిన ఎన్ఎంసీ.. రాష్ట్రంలో 15కు పైగా కాలేజీలకు నోటీసులు పంపింది. హాజరుశాతం 75 శాతానికిపైగా ఉండాలని, లేకపోతే కొత్త నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొత్త నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ అటెండెన్స్ తక్కువగా ఉన్నా, కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్లో పేషెంట్లు లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినా ఎంబీబీఎస్ సీట్లకు కోత పెట్టడం, అవసరమైతే కాలేజీ పర్మిషన్ను రద్దు చేయడం వంటివి చేస్తారు.
డీఎంఈ ప్రిన్సిపాల్గా ఉన్న కాలేజీలో
ప్రస్తుత డీఎంఈ డాక్టర్ వాణి సంగారెడ్డి మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఈ కాలేజీలో గడిచిన వారం రోజుల్లో కనీసం ఒక్కరోజు కూడా 75 శాతం అటెండెన్స్ నమోదు కాలేదు. ఈ కాలేజీలో ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్లు కలిపి 190 మంది ఉన్నారు. సోమవారం నుంచి శనివారం వరకూ వరసగా 72 శాతం, 68, 73, 74, 26, 39 శాతం అటెండెన్స్ మాత్రమే నమోదైంది. శనివారం కాలేజీకి 75 మంది హాజరైతే, అందులో ఏడుగురు మాత్రమే అవుట్ పంచ్ కొట్టారు. మిగిలిన 68 మంది ఒక్క పంచ్ మాత్రమే కొట్టారు. ఈ కాలేజీ ఇన్ టైమ్ ఉదయం 8:17 గంటలు కాగా, యావరేజ్ అవుట్ టైమ్ మధ్యాహ్నం 2:21 గంటలు కావడం గమనార్హం.
అకాడమిక్ డీఎంఈ ఇలాకాలో
ప్రస్తుతం అకాడమిక్ డీఎంఈగా ఉన్న డాక్టర్ శివరామకృష్ణ జగిత్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఈ కాలేజీలో గడిచిన వారం రోజుల్లో ఒకేఒక్క రోజు అటెండెన్స్ 75 శాతం దాటింది. ఈ కాలేజీలో ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్లు కలిపి 112 మంది మాత్రమే ఉన్నారు. సోమవారం నుంచి శనివారం వరసగా 77 శాతం, 71, 74, 75, 23, 31 శాతం అటెండెన్స్ మాత్రమే నమోదైంది. శనివారం కాలేజీకి35 మంది హాజరైతే అందులో ఇద్దరు మాత్రమే అవుట్ పంచ్ కొట్టారు. మిగిలిన 29 మంది ఒక్క పంచ్తోనే సరిపెట్టారు. ఈ కాలేజీ యావరేజ్ ఇన్ టైమ్ ఉదయం 9:36 గంటలు కాగా, యావరేజ్ అవుట్ టైమ్ మధ్యాహ్నం 1:05 గంటలుగా ఉంది.
మధ్యాహ్నమే అవుట్
కామారెడ్డి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్లో, ఇటీవల ఐసీయూలో ఉన్న ఓ పేషెంట్ను ఎలుకలు కొరికాయి. ఈ కాలేజీలో ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్స్ కలిపి 82 మంది ఉన్నారు. ఇక్కడ యావరేజ్ అవుట్ టైమ్ ఉదయం 11 గంటల 57 నిమిషాలుగా ఉంది. అంటే, మెజారిటీ డాక్టర్లు మధ్యాహ్నం 12 గంటలు కూడా కాక ముందే హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లిపోతున్నట్టు స్పష్టమవుతోంది. ఇక్కడ అటెండెన్స్ కూడా దారుణంగా ఉంది. గడిచిన వారం రోజుల్లో కనీసం ఒక్కరోజు కూడా 65 శాతానికి మించి అటెండెన్స్ నమోదు కాలేదు. సోమవారం నుంచి శనివారం వరకు వరసగా 65, 60, 65, 58, 14, 41 శాతం అటెండెన్స్ నమోదైంది.
దారుణమైన అటెండెన్స్
ఎన్ఎంసీ నిబంధనల ప్రకారంలో కాలేజీలో పనిచేసే టీచింగ్ ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్లు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలి. రోజూ 75 శాతానికి మించి అటెండెన్స్ నమోదు కావాలి. కానీ, మన దగ్గర కనీసం సగం కాలేజీల్లో కూడా 75 శాతానికి మించి హాజరు నమోదైతలేదు. అంతేకాదు, ఉదయం 9 గంటలకు రావాల్సిన వాళ్లు, 11 గంటల తర్వాత వస్తున్నారు. ఉదయం పది గంటల వరకు కూడా కనీసం 30 శాతం మంది అటెండెన్స్ వేయడం లేదు. ఇదొక్కటే కాదు, నిబంధనల ప్రకారం రోజూ ఇన్ అండ్ అవుట్ అటెండెన్స్ నమోదు చేయాలి.
కానీ, ఏదో ఒకసారే అటెండెన్స్ వేసి, రెండో పంచ్ మిస్ చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు వచ్చి, 4 గంటల వరకూ కాలేజీలోనో, కాలేజీకి అనుబంధ టీచింగ్ హాస్పిటల్లోనో ఫ్యాకల్టీ ఉండాలి. చాలా మంది అలా ఉండడం లేదు. మధ్యాహ్నం 2 గంటలకే కాలేజీ నుంచి వెళ్లిపోతున్నారు. ఏదో ఒకసాకు చెప్పి అవుట్ పంచ్ వేయడం లేదు. ఈ అంశాలను కూడా ఎన్ఎంసీ రికార్డు చేస్తుండడం గమనార్హం. ఇంకొంత మంది సీనియర్లైతే తమ ఫోన్లోనే బయోమెట్రిక్ నమోదు చేయించుకుని, ఇంటి దగ్గర్నుంచే అటెండెన్స్ నమోదు చేస్తున్నారు.