
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్పంచ్ ల పదవీ కాలాన్ని మరికొంత కాలం పొడిగించాలని ప్రభుత్వాన్ని సర్పంచ్ ల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి కోరారు. కరోనా వల్ల రెండు ఏండ్లు ఊర్లలో డెవలప్ మెంట్ ఆగిందని తెలిపారు.2019లో బాధ్యతలు స్వీకరించినా చెక్ పవర్ లేక 8 నెలలు ఇబ్బందులు పడ్డామని మంగళవారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. ఈ అంశాలను రాష్ర్ట ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని లక్ష్మీనర్సింహరెడ్డి విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ లకు , ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ ను ముడిపెట్టడంతో చాలా వివాదాలు జరిగాయని చెప్పారు.
ఇద్దరు నేతలు వేరు వేరు పార్టీలకు చెందటం, ఊర్లలో తగదాల ఉండటంలో సహకరించలేదన్నారు. సర్పంచ్లు అప్పులు తెచ్చి ఊర్లలో డెవలప్ మెంట్ పనులు చేపించారని, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి బిల్లులు విడుదల చేయకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామని తెలిపారు. బిల్లులు రాక కొందరు సర్పంచ్ లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి ప్రతి సర్పంచ్ కి రూ.5 లక్షల నుంచి రూ.20లక్షల వరకు బిల్లులు బకాయిలు ఉన్నాయని లక్ష్మీనర్సింహరెడ్డి పేర్కొన్నారు.