ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరిక
సెక్యూరిటీ ఏర్పాట్లలో సూచనలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ టెర్రర్ గ్రూపులు టార్గెట్గా చేసుకున్నాయని, ఆదివారం ఢిల్లీలో జరగనున్న ర్యాలీలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ శాఖ హెచ్చరించింది. ఎస్పీజీ, ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది. ప్రధాని రక్షణకు సంబంధించి బ్లూబుక్లోని జాగ్రత్తలన్నీ పాటించాలని, సెక్యూరిటీ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఈ ర్యాలీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇందులో ప్రధానితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు పాల్గొంటారు.
ప్రధాని ర్యాలీకి జనం భారీగా హాజరయ్యే అవకాశం ఉండడంతో టెర్రరిస్టులు దాడి జరిపే అవకాశం ఉందని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తదనంతర పరిస్థితుల నేపథ్యంలో లష్కరే తాయిబా వంటి టెర్రర్ గ్రూపులు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నాయని వివరించింది. పాక్ భూభాగంపై ఉన్న టెర్రర్ గ్రూపులకు ఐఎస్ఐ ఆర్థికంగా సాయపడుతోందని ఐబీ ఆరోపించింది.