- ఉత్తర తెలంగాణలో ఉగ్రజాడలు
- మళ్లీ యాక్టివ్ అయిన టెర్రరిస్ట్ గ్రూపులు
- కీలక డాక్యుమెంట్లు, హార్డ్డిస్క్లు సీజ్
- సమాచారాన్ని విశ్లేషిస్తున్న ఎన్ఐఏ
నిర్మల్, వెలుగు: ఉత్తర తెలంగాణలో ఉగ్రవాద సంస్థలు మళ్లీ కార్యకలాపాలను మొదలు పెట్టడం కలకలం రేపింది. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భైంసాల్లో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) నిర్వహించిన సోదాల్లో ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం. పాపులర్ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కరాటే శిక్షణ పేరిట యూత్ ను ఆకర్శించి వారికి ఉగ్ర కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. గతంలోనూ పాకిస్తాన్కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు ఈ ప్రాంతంలో కార్యకలాపాలపాలను నిర్వహించాయి. మళ్లీ కొంత కాలంగా అవి యాక్టివ్ అయ్యాయి.
నిజామాబాద్, ఆర్మూర్లలో కొద్దిరోజుల కింద పీఎఫ్ఐ కార్యకలపాలను గుర్తించిన ఎన్ఐఏ ఆఫీసర్లు రెండు రోజుల కింద ఏకకాలంలో చాలా చోట్ల దాడులు చేశారు. నిజామాబాద్లో 23 చోట్ల, జగిత్యాలలో 7, భైంసాలో 2 చోట్ల, ఆదిలాబాద్, కరీంనగర్లలో ఒక్కో చోట దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించిన సమాచారం ఇప్పటికే ఎన్ఐఏ సేకరించింది. నిజామాబాద్ కేంద్రంగా పలు ప్రాంతాలకు ఉగ్ర కార్యకలపాలు విస్తరించనున్నట్టు గుర్తించారని తెలుస్తోంది. ఎన్ఐఏ సీజ్ చేసిన డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలిస్తే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని పట్టణాల మీద ఈ సంస్థలు ఫోకస్ చేసినట్టు భావిస్తున్నారు. నిజామాబాద్, భైంసా, ఆదిలాబాద్లతోపాటు మహారాష్ట్రలోని ధర్మా బాద్, భోకర్, నాందేడ్, ఔరంగాబాద్, హిమాయత్నగర్, ఇస్లాపూర్ లో ఈసంస్థ యూత్ను రిక్రూట్మెంట్ చేయనుందని అనుమానిస్తున్నారు.
ముంబై పేలుళ్లతో భైంసాకు లింక్
కార్యకలాపాలతో ఈ ప్రాంతానికి చాలాకాలం నుంచి సంబంధాలున్నాయి. ముంబై బాంబు పేలుళ్ల కేసులో ప్రమేయం ఉన్న భైంసాకు చెందిన ఓ వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష పడింది. ఈ వ్యక్తి ముంబై పేలుళ్లతోపాటుఅంతకు ముందు కూడా టెర్రరిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని ధర్మాబాదుకు చెందిన ఆజాం ఘోరీ అనే ఐఎస్ఐ టెర్రరిస్ట్ భైంసాతో పాటు నాందేడ్, నిజామాబాద్, జగిత్యాల తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు. యువకులను చేరదీసి.. వారికి శిక్షణ ఇచ్చాడు. వారికి ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాల విస్తరించే బాధ్యతలను అప్పజెప్పినట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. నకిలీ కరెన్సీ, మాదకద్రవ్యాల దందాతోనూ అజాం ఘోరీకి సంబంధాలున్నాయనా ఆరోపణలు వచ్చాయి.
2000లో అజాం ఘోరీ జగిత్యాలలో జరిగిన ఎన్ కౌంటర్లో చనిపోవడంతో అతని నెట్వర్క్ దెబ్బతిన్నది. 2002లో నిజామాబాద్ దగ్గరున్న సారంగపూర్లో అన్వర్ అనే ఐఎస్ఐ టెర్రరిస్ట్ అరెస్టయ్యాడు. ఆతర్వాత కూడా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న పలువురు పోలీసులకు చిక్కారు. తిరిగి ఇప్పుడు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరిట కార్యకలాపాలు మొదలయ్యాయి. యూత్ను ఆకర్శించి ఆవేశ పూరిత ప్రసంగాలతో వారికి విద్వేషాన్ని నూరిపోయడం ద్వారా నెట్ వర్క్ విస్తరిస్తున్నారు. చాలాపట్టణాల్లో పని చేస్తున్న పీఎఫ్ ఐ యూత్తోపాటు చిరువ్యాపారులను టార్గెట్ చేసిందని అనుమానిస్తున్న అధికారులు.. ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ ఇచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
