మోడీ అండతో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి: సోనియా గాంధీ

మోడీ అండతో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి: సోనియా గాంధీ

ఢిల్లీలోని JNU క్యాంపస్‌లో జరిగిన హింసపై దేశంలో ఉన్న ప్రముఖులతో పాటు విదేశాల్లో ఉన్న JNU పూర్వ విద్యార్థులు  తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే క్యాంపస్‌లో జరిగిన హింసకు కారణం బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లేటెస్ట్ గా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జేఎన్‌యూ ఘటనపై స్పందించారు.

ప్రధాని మోడీ అండతో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయని సోనియా గాంధీ ఆరోపించారు. విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువతకు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు,యువతకు ప్రయోజనకరమైన విద్య అవసరమన్నారు. ఉపాధి, ఉద్యోగాలు లభించే విద్యతో పాటు.. ప్రజాస్వామ్యంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు అవకాశం ఉండాలన్నారు. అయితే మోడీ సర్కారు మాత్రం వారి హక్కుల నుంచి వారిని దూరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రతిరోజు దేశంలోని క్యాంపస్, కాలేజీల్లో పోలీసులు.. ఇతర అసాంఘిక శక్తులు దాడులకు దిగుతున్నాయని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు.