2015 గ్రూప్ 2లో వైట్ నర్ వాడిన వాళ్ల లిస్ట్ తీస్తున్నారు..!

2015 గ్రూప్ 2లో వైట్ నర్ వాడిన వాళ్ల లిస్ట్ తీస్తున్నారు..!

2015  గ్రూప్-– 2 సెలెక్షన్ లిస్టును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్ణయించింది. బుధవారం చైర్మన్ బుర్ర వెంకటేశం అధ్యక్షతన కమిషన్ అత్యవసరంగా భేటీ అయింది. గ్రూపు–2 సెలెక్షన్ లిస్టు రద్దుతో తలెత్తిన పరిణామాలు, కోర్టు తీర్పులోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే.. డివిజన్​ బెంచ్​లో అప్పీల్​ చేయాలని కమిషన్ నిర్ణయానికి వచ్చింది. కాగా.. ఈ అంశం సుప్రీం కోర్టు దాకా వెళ్లివచ్చిన తర్వాతే తుది ఫలితాలు విడుదల చేసినట్లు కమిషన్ అధికారులు చెప్తున్నారు. మరో పక్క హైకోర్టు కూడా తన జడ్జిమెంట్​లో పలుమార్లు టెక్నికల్ కమిటీ సిఫారసులను అప్పటి ప్రభుత్వం, కమిషన్ అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నది.

ఈ నేపథ్యంలో అప్పటి టెక్నికల్ కమిటీ ఏయే అంశాలను సిఫారసు చేసిందనే దాన్ని పరిశీలిస్తున్నారు. అప్పటి కమిషన్​లో కీలకంగా వ్యవహరించిన వారితోనూ ప్రస్తుత కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం మాట్లాడినట్టు తెలిసింది. 

వైట్​నర్​ వాడిన వాళ్ల లిస్టు తీస్తున్నరు 

2015 గ్రూప్–2 ఎగ్జామ్  పార్ట్ బీలో (ఆన్సర్ షీటు) వైట్​నర్  వాడిన అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ అధికారులు బయటకు తీస్తున్నారు. అప్పట్లో 4.7 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాయగా.. వారికి సంబంధించిన 22 లక్షల ఆన్సర్ షీట్లు (ఓఎంఆర్) పరిశీలించాల్సి ఉంది. ఈ లిస్టులన్నీ వెరిఫై చేయాలని తాజాగా డిసైడ్ అయ్యారు. 

మరోపక్క కొన్ని సెంటర్లలోనే ఎక్కువ మంది వైట్ నర్ యూజ్ చేయడంతో వారి డేటా తీసుకుంటున్నారు. దీనికితోడు అసలు ఎంతమంది అభ్యర్థులు వైట్ నర్ వాడారు.. బబ్లింగ్ తప్పులు చేసినోళ్లు ఎంతమంది..? అనే లెక్కలను అధికారులు సేకరిస్తున్నారు. అప్పీల్​కు వెళ్లేటప్పుడు కోర్టు ముందు పూర్తి సమాచారం ఉంచేందుకు కమిషన్ ఈ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కాగా.. 2015 గ్రూప్ 2తో  ఉద్యోగాలు పొంది విధుల్లో ఉన్నవారు టీజీపీఎస్సీ అప్పీల్ కు వెళ్లాక కేసులో ఇంప్లీడ్ కావాలని డిసైడ్ అయినట్టు తెలిసింది.