ఒకప్పుడు మందు, సిగరెట్లు తాగేటోళ్లకు, మాంసం బాగా తినేటోళ్లకు గుండెజబ్బులు వస్తుండేవి. కారణం, గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే ఆర్టరీల్లో (సిరలు) కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వస్తుంది. దాన్నే అథెరోస్క్లీరోసిస్ అంటారు. కానీ, ఈ మధ్య కాలంలో వయసు, తిండి, ఇతర అలవాట్లతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి. దానికి కారణం అలవాట్లు కాదా? అంటే, ఓ రకంగా అదే కరెక్ట్ అని అంటున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డయీగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు. 30 లక్షల ఏళ్ల క్రితం మన పూర్వీకుల్లో ఓ జీన్లో మార్పులు జరగడం వల్లే గుండె జబ్బులు వస్తున్నట్టు చెబుతున్నారు. ఎలుకలపై చేసిన పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని తేల్చారు. ఇండియాకు చెందిన డాక్టర్ అజిత్ వర్కి ఈ స్టడీకి నేతృత్వం వహించారు. మన పూర్వీకుల్లో సీఎంఏహెచ్ అనే జీన్ ఉండేదని, అది న్యూ5జీసీ అనే ఓ మాలిక్యూల్(సియాలిక్ యాసిడ్)ను విడుదల చేసేదని భావిస్తున్నారు.
మలేరియా కారణంగా అప్పటి మానవుల్లో ఆ జీన్లో మార్పులొచ్చి సియాలిక్ యాసిడ్ లోపించి ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు ఎలుకల్లోనూ ఆ జీన్లో మార్పులు చేసి సియాలిక్ యాసిడ్ పోయేలా చేశారు. దాని వల్ల ఎలుకల్లో రెండు రెట్లు ఎక్కువగా గుండెజబ్బు ముప్పులు వచ్చాయని నిర్ధారించారు. కాబట్టి మనిషిలో ఆ జీన్లో జరిగిన మార్పుల వల్లే గుండె జబ్బులు వస్తుండొచ్చని చెప్పారు. దానికితోడు జంతు మాంసాన్ని తింటే ఆ ముప్పు ఇంకా ఎక్కువ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానికీ కారణాలున్నాయని అజిత్ చెప్పారు. రోగనిరోధక వ్యవస్థ తెల్ల రక్తకణాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల వాపు పెరిగి, సిరల గోడలకు అతుక్కున్న కొవ్వు క్లియర్ కావట్లేదని గుర్తించారు. సహజంగా కాకుండా ఆహారంలో న్యూ5జీసీని సప్లిమెంట్లా తీసుకుంటే ముప్పు ఇంకా ఎక్కువ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదని తేల్చారు.
ఆస్పిరిన్తో చేటే
గుండె రోగులకు ఆస్పిరిన్ మందును ఇస్తుంటారు. అది రక్తాన్ని పలుచన చేసి, ప్రసరణను పెంచుతుంది. కానీ, ఆ మందుతో చేటే అంటున్నారు సైంటిస్టులు. అప్పట్లోనూ దీనిపై వాదనలు నడిచినా కొందరు డాక్టర్లు కొట్టిపారేశారు. తాజాగా మళ్లీ దానిపై స్టడీ చేసి ఈ విషయాన్ని తేల్చారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన బెథ్ ఇజ్రాయెట్ డీకోనెస్ మెడికల్ సెంటర్ సైంటిస్టులు స్టడీ చేసి ఈ విషయాన్ని నిర్ధారించారు. 2017లో సీడీసీ చేసిన నేషనల్ హెల్త్ ఇంటర్వ్యూ సర్వేని పరిశీలించి చెప్పారు. చాలా మంది ఎలాంటి గుండెజబ్బులు లేకున్నా అవి రావొద్దన్న కారణంతో ఆస్పిరిన్ను తీసుకుంటున్నారని గుర్తించారు. దాని వల్ల భవిష్యత్తులో బ్లీడింగ్, జీర్ణకోశ సమస్యలు వస్తాయని హెచ్చరించారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.