క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల కలెక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్కు ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఈ రెండు రాష్ట్రాలను లోరిస్కు ప్రాంతంగా నిర్ధారించిన ప్రభుత్వం, ప్రస్తుతం కేసుల సంఖ్య తీవ్రస్థాయికి చేరటంతో ఈ రెండు రాష్ట్రాలను హైరిస్కు ప్రాంతాలుగా గుర్తించింది.ఈ మేర‌కు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి అన్ని జిల్లాల అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

క్వారంటైన్ విధానంలో మార్పులు ఇవే..

  • విదేశాల నుంచి ఏపీకి వచ్చే 7 రోజుల క్వారంటైన్ తప్పనిసరి
  • గల్ఫ్ నుంచి వచ్చిన వారికి 14 రోజుల క్వారంటైన్ 7 రోజులకు కుదింపు
  • విదేశాల నుంచి ఏపీకి తిరిగివచ్చి క్వారంటైన్ లో ఉన్న వారికి 5 వ రోజు, 7వ రోజున కోవిడ్ టెస్టు చేయాలని అధికారులకు ఆదేశాలు.
  • దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల్లో 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్ గా కరోనా టెస్టు చేయాలని ఆదేశం.
  • విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేయాల్సిందిగా సూచన, వారందరికీ 14 రోజుల హోమ్ క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలి.
  • రైళ్ల ద్వారా ఏపీకీ వచ్చే వారిలోనూ ర్యాండమ్ గా టెస్టులు చేయాలి, , 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి.
  • రహదారి మార్గం ద్వారా ఏపీలోకి ప్రవేశించే చోట బోర్డర్ చెక్ పోస్టుల వద్దే స్వాబ్ టెస్టులు చేయాలి.
  • తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులకు 14 రోజుల హోమ్ క్వారంటైన్.
  • ఏపీకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా ఇ-పాస్ కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాల్సిందేనని తెలిపిన ప్రభుత్వం
  • రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులను తక్షణం వేరు పరిచి కోవిడ్ ఆస్పత్రులకు తరలించాలి.
  • హోమ్ క్వారంటైన్ చేసిన వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఏఎన్ఎం లు, గ్రామ వార్డు వాలంటీర్, సచివాలఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు.