
హైదరాబాద్, వెలుగు: ఇంకో వారం పది రోజుల్లో సెక్రటేరియట్ మొత్తాన్ని ఖాళీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా పాత సచివాలయం గేట్లు మూతబడిపోతున్నాయి. కొన్ని శాఖలకు కరెంట్ కనెక్షన్ కట్చేశారు. ఆదివారం నుంచి ఏపీ సచివాలయం గేటుకు తాళం పడబోతోంది. సెప్టెంబర్ 1 నుంచి ఏపీ గేటును మూసేస్తున్నామని జీఏడీ అధికారులు ఓ నోటీస్ కూడా పెట్టారు. సెకట్రేరియట్ షిఫ్టింగ్ దాదాపు 60% పూర్తి కావడంతో త్వరలోనే కూల్చివేతలు మొదలుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే 25 ఏళ్ల పాటున్న ఏపీ గేట్ను మూసేస్తున్నారు. కూల్చివేశాక అది పూర్తిగా కనపడకుండా పోనుంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎం అయ్యాక 1995లో లుంబినీ పార్కు ఎదురుగా ఈ గేటును ఏర్పాటు చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మొదలయ్యే దగ్గర సచివాలయానికి ఎంట్రెన్స్ ఉండేది. దాని వాస్తు బాగాలేదనిచంద్రబాబు దాన్ని లుంబినీ పార్కుకు ఎదురుగా మార్చారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు రెండేళ్లు హైదరాబాద్ నుంచే పాలన చేశారు. ఈ టైంలో ఏపీ గేటు నుంచే లోపలికెళ్లేవారు. ఎన్టీఆర్మార్గ్ వైపు తెలంగాణ గేటును ఏర్పాటు చేశారు.
త్వరలో నీళ్లు, కరెంట్ కట్
ప్రస్తుతం శాఖల షిఫ్టింగ్తో పేషీలు ఖాళీ అయ్యాయి. కారిడార్లలో చిత్తు కాగితాలు పేరుకుపోయాయి. వీటిలో జనాలు సమస్యలపై ఇచ్చిన వినతి పత్రాలూ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఖాళీ అయిన ఈ బ్లాక్లకు త్వరలోనే కరెంట్, నీళ్ల కనెక్షన్ను కట్ చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొన్ని చాంబర్లలో సామాను ఖాళీ అవడంతో ఎలుకలు తెగ తిరిగేస్తున్నాయి. ఇంటర్నెట్ కేబుళ్లను కొట్టేస్తున్నాయి. దీంతో శనివారం నెట్కనెక్షన్ కట్ అయి డ్యూటీలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. మరికొద్ది రోజుల్లో బడ్జెట్ఉండడంతో డీబ్లాక్లో ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది కసరత్తులు ముమ్మరం చేశారు. అయితే, నెట్ కట్ అవడంతో అధికారులు ఇబ్బంది పడ్డారు. ఇంటర్నెట్ కేబుళ్ల రిపేర్కు లక్ష రూపాయల దాకా ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు.