ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన తీహార్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. ఈక్రమంలోనే పలువురు కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ కోర్టుకు వెళ్లారు. జైలులో ఉంటూ సమర్థవంతమైన పాలన అందించలేరంటూ తక్షణమే పదవి నుంచి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు కోర్టుకు వెళ్లారు. ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసిన పని అని వ్యాఖ్యానించింది.
ఈ మేరకు జస్టిస్ ప్రసాద్ కోర్టు సమయాన్ని వృదా చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రిగా కొనసాగడం కొనసాగకపోవడం అనేది కేజ్రీవాల్ వ్యక్తిగత అభిప్రాయం అని స్పష్టం చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించడంలో కేజ్రీవాల్ అసమర్థత కలిగి ఉన్నారని ఆరోపిస్తూ సందీప్ కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలోనూ కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు తిరస్కరించింది. ఏప్రిల్ 4న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై పిటిషన్ ను స్వీకరించేందుకు నిరాకరించింది.