గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ప్లాంట్లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికిన దళారులు నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఉద్యోగాలు చేసిన ఏడాది తర్వాత కొత్త కాంట్రాక్టర్ వచ్చి సుమారు 300 మందిని తొలగించడంతో దళారుల వసూళ్ల బాగోతం బయటపడింది. తాము ఇచ్చిన డబ్బులు వాపస్ ఇవ్వాలని బాధితులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. ఈ దళారుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఎక్కువమంది ఉండడం గమనార్హం.
పర్మనెంట్ ఉద్యోగమంటూ..
మూసివేసిన ఎరువుల ఫ్యాక్టరీ స్థానంలో గ్యాస్ బేస్డ్గా కొత్త టెక్నాలజీతో రామగుండం యూరియా ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్య సంస్థలతో నెలకొల్పింది. అయితే ఈ ప్లాంట్ ఏర్పాటు దళారులకు వరంగా మారింది. ప్లాంట్లోని యూరియా బ్యాగ్ల లోడింగ్, డిస్పాచ్, బ్యాగింగ్, స్టిచ్చింగ్, బెల్ట్ సెక్షన్, హౌజ్ కీపింగ్ తదితర లొకేషన్లలో పనులు చేయించే మ్యాన్ పవర్ సప్లై కాంట్రాక్ట్ టెండర్ మొదట కోల్కతాకు చెందిన ఫైవ్ స్టార్ అనే సంస్థకు లభించింది. ఈ సంస్థ నుంచి గోదావరిఖని గౌతమీనగర్కు చెందిన టీఆర్ఎస్ లీడర్ మోహన్గౌడ్(రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అనుచరుడు, ఈయన భార్య గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్పై 39వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు), మరికొందరితో కలిసి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. లోడింగ్ టెండర్ సబ్ కాంట్రాక్టు తీసుకున్న మోహన్గౌడ్ టీఆర్ఎస్కు చెందిన వ్యక్తి కావడంతో ఆయా గ్రామాల్లోని ఆ పార్టీకి చెందిన చోటామోటా లీడర్లు, ఆయనతో పరిచయం ఉన్న ఇతర పార్టీలు, యూనియన్లకు చెందిన లీడర్లు, కొందరు కార్పొరేటర్లు, వ్యక్తులు రంగంలోకి దిగారు. రామగుండం, మంథని, పెద్దపల్లి, ధర్మపురి, మంచిర్యాల తదితర నియోజకవర్గాల్లోని వివిధ పట్టణాలు, గ్రామాలకు చెందిన నిరుద్యోగులకు ఆర్ఎఫ్సీఎల్లో పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆశలు కల్పించారు. నెలకు రూ.25 వేల జీతం వస్తుందని, క్వార్టర్ సౌకర్యం, స్విమ్మింగ్ ఫూల్, పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్, కుటుంబానికి వైద్య సేవలు అందిస్తారని ప్రచారం చేశారు. ఆ మాటలు నమ్మి ఉద్యోగం పెట్టించాలని పలువురు కోరడంతో దళారులు నిరుద్యోగుల అవసరాన్ని బట్టి ఒక్కొక్కరి వద్ద రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశారు.
కొత్త కాంట్రాక్టు సంస్థ రావడంతో..
ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్లో మ్యాన్ పవర్ సప్లై లోడింగ్ టెండర్ 2022 ఫిబ్రవరి 17 నుంచి జగదీశ్చౌదరి ఎంటర్ప్రైజెస్ అనే కాంట్రాక్టు సంస్థకు వచ్చింది. ఈ సంస్థ నుంచి కూడా సబ్ కాంట్రాక్టు మళ్లీ తామే తీసుకుంటామని మోహన్గౌడ్, అతని బ్యాచ్(దళారులు) నమ్మబలికారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఆయనకు సబ్ కాంట్రాక్టు ఇవ్వలేదు. సొంతంగా కొత్త కాంట్రాక్టు సంస్థనే చేయడానికి ముందుకు వచ్చింది. లోడింగ్ టెండర్లో 400 నుంచి 450 మంది వరకే కార్మికులు అవసరం ఉండగా ఎక్కువ మంది పనిచేస్తున్నారని భావించిన కాంట్రాక్ట్ సంస్థ మిగులు కార్మికులను తొలగించింది. మొత్తం 798 మంది వివిధ లొకేషన్లలో పనిచేయగా, వారిలో 198 మంది పేర్లను తొలగించి 600 మందితో కూడిన లిస్ట్ను మోహన్గౌడ్ కొత్త కాంట్రాక్టు సంస్థకు ఇచ్చాడు. కానీ ఇందులో 300 మందిని కాంట్రాక్టు సంస్థ పక్కనపెట్టి బిహార్ నుంచి 120 మందిని తీసుకువచ్చింది. ప్రస్తుతం పాతవారు 300 మంది, బిహార్ నుంచి వచ్చిన 120 మందితో కలిపి 420 మందికి మాత్రమే గేట్పాస్లు తయారు చేశారు. దశలవారీగా తొలగించిన సుమారు 500 మంది తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ రోడ్డెక్కారు. ఉద్యోగాలు కోల్పోయిన బాధితుల్లో కొందరు తాము డబ్బులు ఇచ్చిన వారి ఇండ్లకు వెళ్లి అడుగుతున్నారు. ఇందులో రామగుండం నియోజకవర్గంలోని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, ఎన్టీపీసీ కాశిపల్లి ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త, పలువురు రామగుండం కార్పొరేషన్ కార్పొరేటర్లు, యూనియన్ లీడర్లు, పెద్దపల్లి ప్రాంతానికి చెందిన ఓ మాజీ జడ్పీటీసీతో పాటు గతంలో సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు.
40కోట్ల వరకు వసూళ్లు?
ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి సుమారు 500 మంది వద్ద రూ.40 కోట్ల వరకు దళారులు వసూలు చేసినట్టు సమాచారం. ఈ డబ్బుతో భూములు కొన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మొదట 798 మందికి గేట్ పాస్లు ఇవ్వగా. అందులో వంద మంది వరకు ప్లాంట్ పరిసర, ప్రభావిత ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. వీరి వద్ద నుంచి డబ్బులు తీసుకోలేదని తెలుస్తోంది. మిగిలిన వారి నుంచి పరిస్థితులను బట్టి డబ్బులు వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన 500 మంది రోడ్డున పడ్డారు. తాము అప్పులు చేసి, బంగారం. గొర్రెలు అమ్ముకుని డబ్బులు తెచ్చి ఇచ్చామని వాపోతున్నారు. తమను ఉద్యోగాల్లో నుంచి తీసేసినందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పలువురు చేసిన ఆందోళనల ఫలితంగా కొందరికి దళారులు డబ్బులు వాపస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ మరికొందరికీ ఇవ్వకపోవడంతో రెండు రోజుల క్రితం ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జోక్యం చేసుకుని తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
రూ.8 లక్షలు ఇచ్చా
ఆర్ఎఫ్సీఎల్లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తాం, క్వార్టర్ సౌకర్యం కల్పిస్తాం అంటే గ్రామానికి చెందిన మధ్యవర్తి ద్వారా టీఆర్ఎస్ లీడర్కు రూ.8 లక్షలు ముట్టజెప్పా. తర్వాత ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్లో ఫైవ్ స్టార్ కాంట్రాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో గేట్ పాస్ ఇచ్చి బ్యాగ్ స్టిచ్చింగ్ సెక్షన్లో కాంట్రాక్టు ఉద్యోగం చేయమన్నారు. నాలుగు నెలలు అక్కడ పని చేశానో లేదో కొత్తగా చౌదరి కాంట్రాక్టు సంస్థ వచ్చి నన్ను తొలగించి గేట్ పాస్ రద్దు చేసింది. పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చాను, నన్నెందుకు తొలగించారని మధ్యవర్తులను నిలదీయడంతో గేట్ పాస్ ఇప్పిస్తామని దాట వేస్తున్నారు. ఇటు డబ్బులు పోయి, అటు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నా. నా డబ్బులు నాకు ఇప్పించండి.
‒ డి.శశికుమార్, ముర్మూర్ గ్రామం