- సిద్దిపేట నుంచి రామస్వామి, కుమ్రంభీం జిల్లాలో రంగయ్య ఎంపిక
న్యూఢిల్లీ/ హైదరాబాద్, వెలుగు: కేంద్రం 2021 నేషనల్ బెస్ట్ టీచర్స్అవార్డులకు తెలంగాణ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. వీరిలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సావర్ఖేడా ప్రైమరీ స్కూల్హెచ్ఎం కడెర్ల రంగయ్య, సిద్దిపేట అర్బన్లోని ఇందిరానగర్ జడ్పీహైస్కూల్ హెచ్ఎం పయ్యావుల రామస్వామి ఉన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, యూటీల నుంచి మొత్తం 44 మందిని ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. తెలంగాణ నుంచి ఆరుగురు టీచర్ల పేర్లను కేంద్రానికి ప్రపోజ్ చేయగా ఇద్దరు ఎంపికయ్యారు. సిద్దిపేట జిల్లాకు చెందిన రామస్వామి 2015 నుంచి ఇందిరానగర్ హైస్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేస్తున్నారు. 2017లో రాష్ట్ర బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న ఆయన ఇందిరానగర్ స్కూల్ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. స్టూడెంట్ల అడ్మిషన్లు భారీగా పెరిగి, ఏటా నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఆసిఫాబాద్కు చెందిన రంగయ్య దాదాపు11 ఏండ్ల నుంచి సావర్ ఖేడ్ టీచర్ గా పనిచేస్తున్నారు. 50 మంది స్టూడెంట్స్ఉన్న ప్రైమరీ స్కూల్ లో అడ్మిషన్లను 250కి పెంచారు. సొంతడబ్బులు, సీఎస్ఆర్ ఫండ్స్తో స్కూల్ను డెవలప్చేశారు. 39 ఏండ్ల వయసులోనే నేషనల్ బెస్ట్ టీచర్అవార్డుకు ఎంపిక కావడం విశేషం. వీరు సెప్టెంబర్ 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు. ఏపీ నుంచి విశాఖపట్నం జిల్లా లింగరాజుపాలెం హైస్కూల్ టీచర్ఫణిభూషణ్ శ్రీధర్, చిత్తూరు జిల్లా ఎం.పాయిపల్లి ఐరాల హైస్కూల్ టీచర్ మునిరెడ్డి బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు.
