
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్ల (ఐటీఆర్) దాఖలుకు చివరి తేదీని పొడిగించే ఆలోచన లేదని ఈనెల 31నే చివరి తేది అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2021–-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జులై 20 నాటికే 2.3 కోట్ల ఆదాయ రిటర్న్లు దాఖలయ్యాయని, వీటి సంఖ్య పెరుగుతోందని కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. కిందటి ఆర్థిక సంవత్సరం (2020–-21) లో ఐటీఆర్ ఫైలింగ్ డిసెంబర్ 31, 2021 వరకు గడువు ఇచ్చారు. అప్పుడు దాదాపు 5.89 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. ‘‘డెడ్లైన్ను పొడిగిస్తామని మొదట్లో చాలా మంది భావించారు. రిటర్న్లను నింపడంలో కొంచెం నెమ్మదించారు. అయితే ఇప్పుడు రోజువారీ ప్రాతిపదికన, మాకు 15 లక్షల నుండి 18 లక్షల వరకు రిటర్న్లు వస్తున్నాయి. ఇది త్వరలో 25 లక్షలు–30 లక్షల వరకు పెరగొచ్చు” అని ఆయన చెప్పారు. సాధారణంగా చాలా మంది రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి రోజు వరకు వేచిచూస్తుంటారు. "పోయినసారి ఐటీఆర్ ఫైలింగ్ చివరి రోజు 9–-10 శాతం మంది మాత్రమే ఫైలింగ్ దాఖలు చేశారు. ఆరోజు 50 లక్షలకు పైగా ఐటీఆర్లు వచ్చాయి. ఈసారి ఈ సంఖ్య కోటి వరకు ఉండొచ్చు”అని ఆయన వివరించారు. ఐటీ రూల్స్ ప్రకారం, తమ ఖాతాలను ఆడిట్ చేయనవసరం లేని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్లను దాఖలు చేయడానికి ఈ నెల 31 వరకు గడువు ఉంది. ఒక వ్యక్తి ఆదాయం సంవత్సరంలో చెల్లించాల్సిన పన్నుల గురించి సమాచారం ఐటీఆర్లో ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ 7 రకాల ఐటీఆర్ ఫారమ్లను రూపొందించింది. ఆదాయ రకం, మొత్తం పన్ను చెల్లింపుదారుల రకాన్ని బట్టి ఉంటుంది. భారీ సంఖ్యలో ఐటీఆర్లు వచ్చినా తట్టుకోవడానికి వీలుగా ఐటీ శాఖ కొత్త పన్ను ఫైలింగ్ పోర్టల్ను బలోపేతం చేశారు. కరోనా వలన కిందటి రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువును పొడిగించారు.