
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (ఒక దేశం, ఒకే ఎన్నికలు) అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. శనివారం (సెప్టెంబర్ 23న) ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలపై అభిప్రాయాల సేకరణ చేపట్టడంతో పాటు సూచనలను తీసుకోవాలని నిర్ణయించింది.
జమిలి కమిటీ తొలి భేటీలో సభ్యులకు సమావేశం అజెండా వివరించారు కమిటీ చైర్మన్ రామ్ నాథ్ కోవింద్. ఈ సమావేశంలో సభ్యులతో పాటు హోం మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి మేఘ్వాలా పాల్గొన్నారు. భేటీ అంతిమంగా జమిలి ఎన్నికలపై అభిప్రాయాల కోసం.. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని ప్యానెల్ నిర్ణయించింది.
జాతీయ పార్టీలతో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను సైతం ఆహ్వానించనున్నట్లు సమాచారం. వీళ్లతో పాటు పార్లమెంట్లో ప్రతినిధులుగా ఉన్న రాజకీయ పార్టీలకూ ఆహ్వానం అందించనుంది. లా కమిషన్ నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేపట్టాలని కోవింద్ కమిటీ నిర్ణయించింది.
కార్యాచరణ ప్రణాళికలు, అధికారిక సంప్రదింపులు ఎలా జరపాలన్న అంశాలపై తొలిరోజు కమిటీ చర్చించింది. కేంద్రం నిర్దేశించిన పనులకు పేపర్ వర్కు తయారు చేయడం, అవసరమైన విషయాలపై లోతైన పరిశోధనలు చేయడంపై చర్చలు జరిగినట్లు తెలిసింది. ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వర్చువల్గా హాజరు కాగా.. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి హాజరు కాలేదని కమిటీ ఓ ప్రకటనను విడుదల చేసింది.