
గతంలోలాగ కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు స్వేచ్ఛ లభించడమే కాక.. ఆ మాత్రమైనా బాగోగులు పట్టించుకునే వారైనా వచ్చారని చెప్పొచ్చు. పదేళ్ల నిర్బంధం తొలగిపోయి సచివాలయంలోకి స్వేచ్ఛగా వెళుతూ పనిచేయగలుగుతున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేయగలిగే వాతావరణం ఏర్పడుతుందని, జర్నలిస్టులకు ‘సువర్ణ కాలం’ వస్తుందని సీనియర్ జర్నలిస్టులంతా భావించారు. కానీ, జర్నలిస్టుల ఆశలు అడియాసలు కావడమే కాకుండా బీఆర్ఎస్ హయాంలో 10 ఏండ్ల పాటు నిర్బంధాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. 2014 నుంచి 2023 వరకు జర్నలిస్టులకు స్వేచ్ఛకరువైంది. ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంప్ ఆఫీసుకు మాత్రమే కాకుండా సచివాలయంలోకి కూడా జర్నలిస్టులు ప్రవేశించకుండా చేశారు. పీఆర్ఓలు పంపించిన సమాచారాన్ని ఉపయోగించుకుని జర్నలిస్టులు వార్తలుగా రాసుకోవాల్సి వచ్చేది. మంత్రివర్గ సమావేశాలు జరిగే స్థలం వద్దకు, పరిసరాలకు కూడా జర్నలిస్టులు వెళ్లలేకపోయారు. బేగంపేటలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రివర్గ సమావేశాలు జరిగితే, అక్కడ జర్నలిస్టులు రోడ్లపై తచ్చాడాల్సి వచ్చేది. మంత్రివర్గ సమావేశాలను వివరించేందుకు ఏర్పాటు చేసే సమావేశం సమయాన్ని కేవలం అరగంట ముందు మాత్రమే తెలియజేసేవారు. అందుకే దూరప్రాంతాల్లో కార్యాలయాలున్న మీడియా ప్రతినిధులు సీఎం క్యాంప్ కార్యాలయానికి ముందుగానే వచ్చి రోడ్లపై తచ్చాడాల్సి వచ్చేది.
జర్నలిస్టులకు కల్పించిన మౌలిక సదుపాయాలు పరిశీలిస్తే హైదరాబాదుతోపాటు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ హయాంలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లభించాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే హైదరాబాదులోని మూడు చోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 2008లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నాలుగోసారి ‘జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ (జెఎన్జెహెచ్ఎస్)కి 70 ఎకరాలు మార్కెట్ధరకు కేటయించారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేటలో 32 ఎకరాలు, ఇదే జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్బషీరాబాద్లో 38 ఎకరాలు కేటాయించారు. ఈ విషయంలో ఒకరు కోర్టులో కేసువేసి అభ్యంతరం తెలిపారు. సుప్రీంకోర్టు 2017 మే 2న మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ 70 ఎకరాల భూమిని జెఎన్జెహెచ్ఎస్కు స్వాధీనం చేయాలని ఆదేశించింది. గుట్టలతో నిండిఉన్న నిజాంపేట్ భూమిని (32 ఎకరాలు), టీఆర్ఎస్/బీఆర్ఎస్ ప్రభుత్వం జెఎన్జెహెచ్ఎస్కు స్వాధీనం చేసింది. చదునుగా ఉన్న పేట్బషీరాబాద్లోని 38 ఎకరాలు స్వాధీనం చెయ్యలేదు. హైదరాబాద్– సిద్ధిపేట జాతీయ రహదారి పక్కనే (సుచిత్ర సర్కిల్ సమీపం)లో ఉన్న 38 ఎకరాల భూమిని ‘కొట్టెయ్యా’లని టీఆర్ఎస్/బీఆర్ఎస్ పెద్దలు కుట్ర చేశారు. ఆనాటి గవర్నమెంట్ ప్లీడర్ (రెవెన్యూ) కూడా ఒక లేఖను 2017 డిసంబర్ 30న ప్రభుత్వానికి రాస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 38 ఎకరాల భూమిని జెఎన్జెహెచ్ఎస్కు
అప్పగించాలని సూచించారు.
సుప్రీంకోర్టు అనుమతి
బీఆర్ఎస్ ప్రభుత్వం 38 ఎకరాల భూమిని జెఎన్జెహెచ్ఎస్కు అప్పగించేందుకు చర్యలు తీసుకోకపోగా ఈ భూమిని స్వాహా చెయ్యాలని ప్రయత్నించారు. అయిదేళ్లు గడిచినా ప్రభుత్వం స్పందించకపోగా, జర్నలిస్టులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు. దాంతో ప్రభుత్వ విధానాన్ని సుప్రీంకోర్టు దృష్టికి జర్నలిస్టులు తీసుకుపోయారు. దాంతో 2022 ఆగస్టు 25న ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం స్పష్టమైన తీర్పు చెబుతూ, పేట్ బషీరాబాద్లోని 38 ఎకరాల భూమిని జెఎన్జెహెచ్ఎస్కు అప్పగించాలని సూచించింది. జర్నలిస్టులు రూ.12.33 కోట్లు ఈ భూమికోసం ప్రభుత్వానికి చెల్లించారని, దీనస్థితిలో ఉన్న జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తున్నామని ఎన్.వి. రమణ బెంచి వెల్లడించింది. వేతనాలు కూడా సరిగ్గా లేక జీవిస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం అత్యవసరమని కూడా స్పష్టం చేసింది.
సుప్రీం తీర్పులను అమలు చేయని కేసీఆర్ సర్కార్
2022 ఆగస్టు 25న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మరుసటి రోజే ఆనాటి మంత్రివర్గంలో కీలకమైన భూమిక పోషించిన పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును అమలుచేస్తామని ప్రకటించారు.
కోర్టు తీర్పువల్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వానికి అవకాశం లభించిందని ప్రకటించారు. కానీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో ఓటమిపాలయ్యేవరకు సుప్రీంకోర్టు 2017లో, 2022లో ఇచ్చిన తీర్పులను అమలు చెయ్యలేదు. ఇళ్లస్థలాలు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు తీర్పులను అమలు చేయాలని పేట్ బషీరాబాద్లోని 38 ఎకరాలు జెఎన్జెహెచ్ఎస్కు స్వాధీనం చేయాలని జర్నలిస్టులు పెద్ద ఎత్తున 2023లో ఆందోళన చేసారు. ధర్నాలు, రౌండ్టేబుల్ సమావేశాలు, బహిరంగ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఖరిని నిరసించారు.
అరచేతిలో వైకుంఠం
ఎనిమిదేళ్ల క్రితం వరంగల్లో జర్నలిస్టులకు అత్యంత అధునాతన సౌకర్యాలతో కూడిన భవనాల సముదాయాన్ని (కాలనీ) నిర్మిస్తానని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వరంగల్లో ఆనాడు జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలోని జర్నలిస్టులంతా అబ్బురపడేలా వరంగల్లో మీడియా కాలనీ నిర్మిస్తాం అన్నారు. బీఆర్ఎస్ 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసేవరకూ కూడా మీడియా కోసం కాలనీ నిర్మాణం కాదు గదా, కనీసం భూమి కూడా సేకరించలేదు. 2022 ఫిబ్రవరిలో హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో కేసీఆర్ మాట్లాడుతూ, జెఎన్జెహెచ్ఎస్కు ఒకటి, రెండు నెలల్లో పేట్బషీరాబాద్ భూమి అప్పగిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించి 10 సంవత్సరాలలో కేవలం 42 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తెలంగాణ మీడియా అకాడమీ భవనం నిర్మాణాన్ని 2016లో ప్రారంభించి 2023 వరకు కూడా పూర్తి చేయలేదు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణం పూర్తి చేశారు. సమాచార, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవలనే ఈ భవనాన్ని ప్రారంభించారు.
సీఎం రేవంత్ ‘మెమో’ ఇచ్చినా..
జర్నలిస్టులు 2023 ప్రారంభంలో చేసిన ఆందోళనలకు ఆనాటి పీసీసీ అధ్యక్షుడిగా ఎ. రేవంత్రెడ్డి మద్దతు తెలిపారు. జర్నలిస్టులు చేసిన ఆందోళనల్లో కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. తాము అధికారంలోకి రాగానే పేట్ బషీరాబాద్లోని 38 ఎకరాలు జెఎన్జెహెచ్ఎస్కు స్వాధీనం చేస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు 2024 సెప్టెంబర్ 8న రవీంద్రభారతిలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి, పేట్ బషీరాబాద్ భూమిని జెఎన్జెహెచ్ఎస్కు అప్పగించేందుకు ‘మెమో’ అందించారు. పేట్ బషీరాబాద్ భూమిపై ఉన్న న్యాయపరమైన అడ్డంకులను తొలగించి 38 ఎకరాలు స్వాధీనం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటున్న సమయంలో, సుప్రీంకోర్టు మరో తీర్పు చెబుతూ గతంలో భూముల కేటాయింపునకు సంబంధించిన జీఓలను కొట్టివేసింది. జెఎన్ఎజెహెచ్ఎస్కు కేటాయించిన 70 ఎకరాల భూమిని వెనుకకు తీసుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుని జర్నలిస్టులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. దాంతో ఇళ్ల స్థలాలు త్వరలోనే లభిస్తాయన్న ఆశతో జెఎన్జెహెచ్ఎస్ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
నాడు ప్రశ్నించడం కూడా నేరమే!
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్, కేటీఆర్ నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశాల్లో మీడియా ప్రతినిధులు స్వేచ్ఛగా ప్రశ్నలు వేసే అవకాశం ఉండేదికాదు. ప్రభుత్వం చేపట్టే ప్రజావ్యతిరేక నిర్ణయాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ‘నీది ఏ పత్రిక? ఏ ఛానెల్? పనికిరాని ప్రశ్నలు వేస్తున్నావు’ అంటూ కేసీఆర్, కేటీఆర్ ఎగతాళి చేసేవారు. ఇప్పుడు ఆ తరహా పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సూటిగానే మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. అంతే సూటిగా ఆయన సమాధానాలు ఇస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, బీఆర్ఎస్ తాబేదారులు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, జర్నలిస్టులకు ఎలాంటి మేలు చేయడం లేదని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన జర్నలిస్టుల్లో ఒకరిద్దరు తరచూ, బీఆర్ఎస్ నేతృత్వంలో నడుస్తున్న పత్రికల్లో విషం కక్కుతున్నారు. ముఖ్యమంత్రిపై అవాకులు, చవాకులు పేలుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్టులకు, జర్నలిజానికి జరిగిన ‘మంచి’ ఏమిటో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి, చర్చిస్తే వాస్తవాలు వెల్లడవుతాయనడంలో
ఎలాంటి సందేహం లేదు.
- పి.వి. రమణారావు,
సీనియర్ జర్నలిస్ట్