
దేశవ్యాప్తంగా పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. కశ్మీర్ టు కన్యాకుమారి వరకూ పాదయాత్ర చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రజల్లోకి మరింత చేరువగా వెళ్లేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పాదయాత్రలు నిర్వహించాలని ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ లో నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలంతా పాదయాత్రల్లో పాల్గొనాలని నిర్ణయించారు.
పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఉదయ్ పూర్ లోని కాంగ్రెస్ నిర్వహిస్తున్న నవసంకల్ప చింతన శిబిరంలో ఈ కీలక ప్రతిపాదన చేశారు. దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా భారీ పాదయాత్ర నిర్వహించాలని కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతూ పాదయాత్ర కొనసాగించాలని ‘సస్టెయిన్డ్ అజిటేషన్ కమిటీ’ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఏడాది పాటు పాదయాత్రలు, రచ్చబండలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న దిగ్విజయ్ సింగ్ పూర్తిస్థాయి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రతిపాదనపై లోతైన చర్చ కూడా జరిగింది. అధికారంలోకి వస్తే ఈవీఎంలకు స్వస్తి పలకాలని కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది. పేపర్ బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
'ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్' విధానాన్ని ఆమోదించింది. ఒక నాయకుడు ఐదు సంవత్సరాల పాటు ఒక పోస్ట్లో ఉండాలని తీర్మానించింది. మరొకరు అదే కుటుంబం నుంచి వచ్చేట్లు అయితే.. కనీసం మూడేళ్ల పాటు పార్టీలో పని చేయాలని నిబంధన విధించింది. పార్టీలో యువతకు 50 శాతం భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. బ్లాక్ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ స్థాయి వరకు 50 శాతం యువత ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. 50 శాతం యువత కోటాలో ఎస్సీ, ఎస్టీ ఓబీసీ, మైనారిటీలకు కూడా చోటు ఉంటుందని స్పష్టం చేసింది.
మరిన్ని వార్తల కోసం..
‘సైకిల్’కు మళ్లీ పెరుగుతున్న క్రేజ్