గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె సోమవారం నాటికి 11వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా గోదావరిఖనిలో కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్, కళ్యాణ్నగర్ వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా జేఏసీ లీడర్లు వేల్పుల కుమారస్వామి, తోకల రమేష్, కె.విశ్వనాథ్, జి.భూమయ్య, మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 22 న జరుగబోయే చర్చల్లో యాజమాన్యం స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని, లేకపోతే పర్మినెంట్ కార్మిక సంఘాల జేఏసీని కలుపుకుని సింగరేణిని స్తంభింపజేస్తామని హెచ్చరించారు.
బీజేపీ లీడర్ కౌశిక హరి, కాంగ్రెస్ లీడర్లు మక్కాన్ సింగ్, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, టీఎల్పీ ప్రెసిడెంట్ గొర్రె రమేశ్ పాల్గొన్నారు. అనంతరం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ ఇన్చార్జి ఎంఎస్ రాజ్ఠాకూర్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు మద్దతుగా వంటవార్పు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.