ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొదటి రోజు ముగిసిన నిందితుల కస్టడీ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొదటి రోజు ముగిసిన నిందితుల కస్టడీ

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొదటి రోజు ముగ్గురు నిందితుల కస్టడీ ముగిసింది. ఇవాళ పోలీసులు దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. ముగ్గురు నిందితులను వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి ప్రశ్నించారు. మొదటి రోజు కస్టడీ ముగిసిన తర్వాత రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ నుండి నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. రేపు ఉదయం మరోసారి విచారించనున్నారు. 

అంతకుముందు.. మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ముగ్గురు నిందితులను ఇవాళ ఉదయం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలు నుండి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కస్టడీలో భాగంగా రామచంద్ర భారతి, నంద కుమార్, సింహాయాజీలను మొదటిరోజు విచారించారు. 

మరోవైపు సిట్ బృందం సైతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తోంది. అంతకుముందు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీని పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నిందితులు ప్రయత్నించారని, కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారని పోలీసుల తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

ముగ్గురు నిందితుల వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలను తెలుసుకోవడానికి నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో వారిని రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. రాజకీయ కారణాలతో ముగ్గురిపైనా అక్రమ కేసులు పెట్టారని, ఎక్కడ కూడా డబ్బులు లభించలేదని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.