కరీంనగర్ రూరల్, వెలుగు: రూ. 12 కోట్లతో కట్టిన చెక్డ్యామ్లవి. ఆరు నెలలు కూడా కాకుండానే ఇటీవలి వరదల తాకిడికి కట్టలు కొట్టుకుపోయాయి. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్, మానేర్వాగులపై ఎలబోతారం, ముగ్ధుంపూర్, ఇరుకుల్ల గ్రామాల్లో చెక్డ్యామ్లను నిర్మించారు. కాంట్రా క్టర్ పనులను సబ్కాంట్రాక్ట్కు ఇవ్వడం, పర్యవేక్షించాల్సిన ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరించడంతో పనులు ఇష్టానుసారం చేశారు. మంత్రి గంగుల ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో నిర్మించిన ఈ చెక్డ్యామ్లు ఆరు నెలలకే దెబ్బతినడం చర్చనీయాంశంగా మారింది.
ముగ్ధుంపూర్లో రూ.6.99కోట్ల ఫండ్తో నిర్మించిన చెక్డ్యామ్ కరకట్టకు రెండుచోట్ల గండిపడి భారీగా కోతకు గురై పనులు పూర్తికాక ముందే తెగిపోయింది. నెల క్రితం కురిసిన భారీ వర్షాలకు రూ.దాదాపు 5కోట్లకు పైగా ఫండ్స్తో నిర్మించిన గోపాల్పూర్ చెక్డ్యామ్ కరకట్ట వరద తాకిడికి పూర్తిగా కొట్టుకుపోయి వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కరీంనగర్ శివారు బొమ్మకల్లో మానేరు వాగుపై నిర్మించిన చెక్డ్యామ్ కూడా నెల క్రితం ఎల్ఎండీ డ్యామ్ గేట్లు
ఎత్తడంతో వరద తాకిడికి కొట్టుకుపోయింది.
నాసిరకం పనులే కారణం..
కాంక్రీట్ పనుల్లో వాగులోనే దొరికే నల్ల ఇసుక వాడడం, చెక్డ్యామ్కు ఇరువైపులా నిర్మించిన కరకట్టకు నాణ్యతలేని మట్టి పోయడం, రోలింగ్ చేయకపోవడం, బ్యాక్ వాల్స్ నిర్మించకపోవడం, సైడ్ బర్మ్స్ పటిష్టంగా కట్టకపోవడం,కరకట్టలకు ఇరువైపులా సైడ్బర్మ్స్ వేయకుండా ఒకే వైపు వేయడం, చెక్ డ్యామ్కు వెళ్లే దారులను సైతం స్థానికంగా దొరికే మట్టితో నిర్మించడంతోనే దెబ్బతిన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని
కోరుతున్నారు.