
రాజకీయాల్లో హీరోలు, విలన్లు ఉండకపోయినా క్లిష్ట సమయాల్లో నాయకుడి నిర్ణయంపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో ముఖ్యంగా కుటుంబ పార్టీల్లో నాయకుడి వ్యూహత్మకమే హీరోయిజం. అన్నీ తెలిసినా పక్షపాతంగా ఉండి వైఫల్యాన్ని ప్రదర్శించడమే విలనిజం. నాణానికుండే బొమ్మా బొరుసులు గురించి అందరికీ తెలిసిందే. అవి జయాపజయాలపై ప్రభావం చూపుతాయి కూడా. కుటుంబ ఆధారిత ప్రాంతీయ పార్టీలు ఒకప్పుడు భారత రాజకీయాల్లో స్థానిక ఆకాంక్షలకు గొంతుకగా నిలిచాయి. అయితే, అధికార దాహం, అవినీతి, కుటుంబ నియంత్రణ వల్ల అవి క్రమంగా పతనం దిశగా సాగుతున్నట్టు చరిత్ర చెబుతున్నది. ఈ పార్టీలు తమ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తేనే దీర్ఘకాలంలో మనుగడ సాధ్యం. లేకపోతే, జాతీయ పార్టీల ఆధిపత్యం, ప్రజల అసంతృప్తి వీటి పతనాన్ని మరింత వేగవంతం చేస్తాయని కూడా ప్రస్తుత రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాంతీయ, కుటుంబ పార్టీల పతనం సాధారణంగా నాలుగు దశలలో జరుగుతుందని చరిత్ర చెబుతోంది.
ఒకటోది.. సిద్ధాంత ఆధారిత ఆవిర్భావం. ప్రాంతీయ పార్టీలు ప్రారంభంలో స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తాయి. ఉదాహరణకు, తెలంగాణలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడింది. రెండోది.. కుటుంబ ఆధిపత్యం. స్థాపకుడు లేదా నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీ నియంత్రణ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్తుంది. బిహార్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్ కుటుంబం ఇందుకు ఉదాహరణలు. మూడోది అవినీతి, ప్రతీకార రాజకీయాలు. అధికారంలో ఉన్నప్పుడు, పార్టీలు తరచూ అవినీతి ఆరోపణలు, కేంద్రీకృత నిర్ణయాధికారం, ప్రతీకార రాజకీయాలకు గురవుతాయి. తమిళనాడులో జయలలిత, కరుణానిధి అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య ఘర్షణాత్మక రాజకీయాలు ఇందుకు నిదర్శనం. ఇక నాలుగోది.. పతనం లేదా ప్రజాదరణ క్షీణత. అవినీతి, అసమర్థ నిర్వహణ, లేదా జాతీయ పార్టీల ఆధిపత్యం వల్ల ఈ పార్టీలు క్రమంగా ప్రజాదరణ కోల్పోతాయి. ఉదాహరణకు, బిహార్లో ఆర్జేడీ, హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ) ప్రజాదరణ కోల్పోయాయి. పై నాలుగు లక్షణాలు ఇప్పుడు బీఆర్ఎస్ కు ఉన్నాయి.
బీఆర్ఎస్లో అంతర్గత పోరు
తెలంగాణ రాజకీయ యవనికపై బీఆర్ఎస్లో జరుగుతున్న అంతర్గత పోరుపై, రాజకీయాధికారం కోసం పార్టీలో వస్తున్న మార్పులను నిశితంగా గమనిస్తే రకరకాల అభిప్రాయాలు వెల్లడికావచ్చు. కానీ, ఈ క్లిష్ట సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ అంతిమ నిర్ణయం కీలకం. ఎవరు అవునన్నా.. కాదన్నా.. పార్టీకి సంక్షోభ ఘడియలివి. బీజేపీలో విలీనయత్నాన్ని స్వయంగా కేసీఆర్ కూతురు కవితనే ధ్రువీకరించడం విపక్షాలకు పెద్ద ఆయుధం. పైగా గడిచిన ఆరు నెలల నుంచి ఆమె బీఆర్ఎస్ పదేండ్ల పాలనా తప్పిదాలపై, విధానాలపై పరోక్షంగా జనాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు పార్టీని నడపడం వాళ్లకు చేతకాదని ఏకంగా నాయకత్వంపై బాణం గురి పెట్టి రాజకీయాల్లో పెద్దచర్చకు దారితీసింది. ప్రతికూల సమయంలో కవిత ఏకంగా పార్టీ భవిష్యత్తును ప్రశ్నించింది. ఈ సమయంలో కేసీఆర్ పార్టీకి కాయకల్ప చికిత్స చేస్తారా లేక పాత తప్పిదాలవలె లైట్ తీసకుంటరా? పార్టీ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభ సమయంలో కేసీఆర్ హీరోగానే ఉంటరా? లేక విలన్గా మారతారా? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక్కటి మాత్రం నిజం. అప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ చెప్పిందే వేదం. చేసిందే శాసనం. తనకు నచ్చని వారిని, పంటికింద రాయిలా మారతారని తెలిసిన క్షణాల్లోనే చాలామందిని పార్టీ నుంచి విజయవంతంగా బయటకు పంపిన కేసీఆర్.. ఇప్పుడు తన కూతురు విషయంలో ఏం చేస్తారనే చర్చ లేకపోలేదు.
హీరోగా, విలన్గా కేసీఆర్
కేసీఆర్ చరిత్ర చూస్తే, ఆయన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నాయకుడు. దశాబ్దాల పాటు కొనసాగిన తెలంగాణ సాధన కలను నిజం చేసిన ఘనత ఆయనది. రాజకీయ చతురత, వాగ్ధాటి, పట్టుదలతో ఆయన బీఆర్ఎస్ను రాష్ట్రంలో అజేయ శక్తిగా నిలబెట్టారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పాలన సాగించిన ఆయన.. తెలంగాణ ప్రజల మనసు గెలుచుకున్న కారణంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు హీరోగా కనిపిస్తారు. కేసీఆర్ గతంలోనూ అనేక రాజకీయ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నప్పటికీ పార్టీని కుటుంబాన్ని చక్కదిద్దడంలో విఫలమయ్యారనే అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్పై విమర్శలు కూడా లేకపోలేదు. పార్టీలో మొదటి నుంచి కుటుంబ సభ్యులకు కీలక పదవులు ఇచ్చి ఇతర నాయకులకు సరైన అవకాశాలు కల్పించలేదు. కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం, కవితకు ఎమ్మెల్సీ, తమ సామాజికవర్గానికే పదవులు కట్టబెట్టడం వంటి నిర్ణయాలు కుటుంబ రాజకీయాలకు ఊతమిచ్చాయి.
సంధి లేని సమరం
కేటీఆర్, కవితల మధ్య విభేదాలు ఇప్పుడు బహిరంగంగా కనిపించడం కూడా కొత్త కాదు. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎలా నియమిస్తారని కవిత.. కేటీఆర్ నాయకత్వ శైలిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతకుముందు పార్టీలో మిగిలిన కుటుంబ సభ్యుల ప్రాధాన్యతపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో కేటీఆర్ను ఫెయిల్యూర్ లీడరుగా సోషల్ మీడియా వార్లో దాడి మరింత ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కేటీఆర్, తన సోదరి కవితను ఏకంగా పార్టీ నుంచి తప్పించాలని చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరమైనట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఈ అన్నా-చెల్లెలు మధ్య జరుగుతున్న అధికార పోరు పార్టీని రెండు వర్గాలుగా విభజిస్తోంది. ఒక వర్గం కేటీఆర్ వైపు నిలబడితే, మరో వర్గం సహజంగా కవితకు మద్దతు ఇస్తోంది. ఈ విభజన పార్టీ కార్యకర్తల మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మాజీ ఎంపీ వినోద్ లాంటివారు కూడా కవిత మనోభావాలతో ఏకీభవించడం గమనార్హం. ఈ విభేదాల వల్ల ప్రజల్లో పార్టీపై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఒకవైపు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఆమెకు పార్టీలో సరైన ప్రాధాన్యత లభించకపోవడం వల్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కేటీఆర్ను పార్టీ వారసుడిగా ప్రకటించే సూచనలు కవితకు మరింత అసంతృప్తిని కలిగించాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఎలా నియంత్రిస్తారు?
ఈ సంక్షోభ సమయంలో అందరి దృష్టి కేసీఆర్పైనే ఉంది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన తీసుకునే నిర్ణయం పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కేటీఆర్, కవితల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరును ఆయన ఎలా నియంత్రిస్తారు? ఇద్దరినీ సమన్వయం చేస్తూ పార్టీని ఏకతాటిపైకి తీసుకొస్తారా? కేసీఆర్ ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో ఉన్నారు. ఇద్దరూ పార్టీలో కీలక బాధ్యతలు కోరుతున్నారు. కవితను పార్టీ నుంచి దూరం చేస్తే, ఆమె సొంత ఎజెండాతో ముందుకు సాగక తప్పదు. ఇది బీఆర్ఎస్ ఓట్ల చీలికకు దారితీసి, రాబోయే ఎన్నికల్లో పార్టీ స్థితిని బలహీనపరుస్తుంది. అదే సమయంలో, కేటీఆర్ను పూర్తిగా విస్మరించడం కూడా కేసీఆర్కు సాధ్యం కాదు. ఆయన ఇప్పటికే పార్టీలో కీలక నాయకుడిగా స్థిరపడ్డారు. కేసీఆర్ ముందున్న ఏకైక మార్గం రాజీ. లేదా, ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అంతర్గత విభేదాలను సమసిపోయేలా చేయాలి. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలే బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
- వెంకట్ గుంటిపల్లి,
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం