వెలుగు, బిజినెస్ డెస్క్ : ఒకప్పుడు మాన్యుఫాక్చరింగ్ అంటే చైనా పేరే గుర్తొచ్చేది.. ప్రపంచానికి ఏ వస్తువు కావాలన్నా.. చైనా నుంచి రావాల్సిందే. కానీ కరోనా వైరస్ ఈ పరిస్థితులన్నింటిన్ని మార్చేసింది. కరోనా వైరస్ చైనాలోనే పుట్టుకురావడం, ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే గ్లోబల్గా విస్తరించడంతో… ప్రపంచమంతా వణికిపోతోంది. సప్లయి చెయిన్ అంతా దెబ్బతింది. ప్రపంచ ఎకానమీలు పడిపోయాయి. ప్రభుత్వాల నుంచి బిజినెస్ లీడర్ల వరకూ ఈ క్రైసిస్ నుంచి ఎలా బయట పడాలా అని రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఫ్యూచర్ ప్లాన్స్ను సిద్ధం చేస్తున్నారు. చైనాలో మాన్యుఫాక్చరింగ్ దెబ్బతినడం ఇండియా లాంటి దేశాలకు ఒక అవకాశమని ప్రముఖ నిపుణులు అంటున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్(హెచ్బీఎస్)లో నిర్వహించిన వెబీనార్లో ఇండియా లాంటి దేశాలకు ఇది ఒక అవకాశమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు కూడా కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలా అని చూస్తున్నారు. వెస్ట్రన్ కంట్రీలు కూడా తమ మాన్యుఫాక్చరింగ్ను చైనా, జపాన్ల నుంచి తరలించాలని చూస్తున్నాయి.
కరోనా దెబ్బకు ప్రొడక్షన్ను అక్కడ నుంచి మార్చేందుకు ప్లాన్ చేశాయి. ఇప్పుడు ఇండియా ఆ దేశాల కంపెనీలకు ఒక స్వర్గధామంగా ఉందని హిందూస్తాన్ యునిలివర్(హెచ్యూఎల్) సీఎండీ సంజీవ్ మెహతా చెప్పారు. ‘మేకిన్ ఇండియా’ ఓ వెలుగు వెలగనుందని చెప్పారు. చరిత్రను చూసుకున్నా.. వై2కే ఛాలెంజ్ ను ఇండియా ఎలా ఒక అవకాశంగా మార్చుకుందో మెహతా వివరించారు. మన ఐటీ ఇండస్ట్రీకి ఇంతలా బూమ్ రావడానికి కారణం వై2కే ఛాలెంజ్ ఒకటని చెప్పుకోవచ్చు. మనమెంత స్ట్రాంగో దీని ద్వారా ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. వై2కే ప్రోబ్లమ్ అంటే… కంప్యూటర్ సిస్టమ్స్లో సంవత్సరాన్ని రెండంకెల్లోనే గతంలో రాసేవారు. దాంతో 99 డిసెంబర్ 31 నాడు అది జీరో జీరో అవుతుంది. అలా జరగకుండా ఉండేలా చూసేందుకు అమెరికా, యూరప్లలోని పెద్ద పెద్ద కార్పొరేట్స్ దగ్గర నుంచి చిన్న కంపెనీల దాకా సాఫ్ట్వేర్ను మార్చుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యను మన ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ ఒక మంచి అవకాశంగా మలుచుకుంది . ఇక మనకున్న రెండో అవకాశం హెల్త్కేర్ సిస్టమ్స్లో పెట్టుబడి పెట్టడమని మెహతా తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడితే, మనం అమలు చేసే సంస్కరణలు ఇండియాకు వరంగా మారనున్నాయని అన్నారు. ప్రస్తుతం ప్రజల జీవనోపాధి, రక్షణ, ఎకనమిక్ స్టిములస్, రిలీఫ్ చర్యలపైనే ప్రభుత్వం ఫోకస్ చేస్తుందని అంచనావేశారు. ఆరోగ్యానికి మించి కరోనా ఏ విధమైన ప్రభావం చూపిస్తుందనే అంశం మీద ఈ హెచ్బీఎస్ వెబినార్లో మెహతా మాట్లాడారు.
హెల్త్కేర్ స్టాఫ్ను మోటివేట్ చేయాలి…
ఇదే వెబినార్లో అపోలో హాస్పిటల్స్ ఎండీ సంగీతా రెడ్డి కూడా పాల్గొన్నారు. వెంటిలేటర్లు, హాస్పిటల్ బెడ్స్ కెపాసిటీని మెరుగుపర్చాలని ఆమె సూచించారు. తమ స్టాఫ్ను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇది చాలా అవసరమని పేర్కొన్నారు.
జీరోగా మారినా.. టీమ్గా పోరాడాలి…
ఈ కరోనా సంక్షోభం ప్రభావం ఎంతుంటుందో, అవుట్కమ్ ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియదు. ప్రపంచమంతా దీని బారిన పడి కొట్టుకుంటోంది. పరిస్థితి జీరోగా మారిన సమయంలో కూడా ఒక టీమ్గా ఏర్పడి.. హోప్లెస్గా ఉన్న పరిస్థితిపై ఎలా పోరాడాలి అనే విషయంపై హెచ్బీఎస్ ప్రొఫెసర్స్ రాబర్ట్ కాప్లాన్, హర్మాన్ లియోనార్డ్, ఆమీ ఎడ్మాండ్సన్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జీరోగా మారిన సమయంలో కూడా ఇంజనీర్లు అందరూ కలిసి ఇన్నోవేటివ్ ఐడియాలతో ముందుకొస్తారని ఎడ్మాండ్సన్ చెప్పారు. లీడర్లు ప్రజలను ఇన్నోవేటివ్ ఐడియాలతో ముందుకు వచ్చే పరిస్థితులను క్రియేట్ చేయాలని సూచించారు. ప్రపంచంలో ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా లీడర్షిప్ ఉందని, ఎవరో, ఎక్కడో తెలియని వారి నుంచి కూడా ఐడియాలు వస్తాయని చెప్పారు. వాటికి లీడర్లు స్వాగతం చెప్పాలన్నారు.
ఎక్కడినుంచైనా, ఎవరినుంచైనా లీడర్షిప్ ..
ఈ వెబినార్లో మాట్లాడిన మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ఛైర్మన్ రవి వెంకటేశన్… చాలా మంది ప్రజల దగ్గర సరికొత్త ఐడియాలు, రిసోర్సెస్ ఉన్నాయని చెప్పారు. కానీ వాటిని వారు యూజ్ చేసుకో లేకపోతున్నారని, ఏదోక పని చేసు కుని బతుకుతున్నారని అన్నారు. ఈ కరోనా సంక్షోభం తర్వాత ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఎంట్రప్రె న్యూర్గా ఉండాలని సూచించారు. లీడర్షిప్ అనేది ఎక్కడినుంచైనా, ఎవరినుంచైనా రావొచ్చని, ఇది ఏదో ఒక టైటిల్ మాత్రం కాదని అన్నారు. మాస్ ఎంట్రప్రెన్యూర్షిప్ కోసం గ్లోబల్ అలయన్స్ను చేపట్టిన రవి వెంకటేషన్.. 100 మిలియన్ డాలర్లకు పైగా ఎస్ఎంఈ స్టెబిలైజేషన్ ఫండ్ను అభివృద్ధి చేశారు.