
- పంజాబ్లో ఖరీఫ్ సాగు కష్టమే
- నిరుడుతో పోలిస్తే 10 శాతం పడిపోయిన నీటి వనరులు
- పంజాబ్ ప్రావిన్స్ లో 80% సాగుకు సింధూ నదీ జలాలే ఆధారం
ఇస్లామాబాద్: పాకిస్తాన్కు సింధూ జలాలు నిలిపివేయడంతో పంజాబ్ ప్రావిన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఖరీఫ్ సీజన్పై దీని ప్రభావం ఎక్కువగా ఉండనున్నది. సింధూ, చీనాబ్, ఝీలం నదులపై పాకిస్తాన్ వ్యవసాయం, తాగునీరు, జలవిద్యుత్ ఉత్పత్తి ఆధారపడి ఉంది. నీటి ప్రవాహం తగ్గడంతో వ్యవసాయం దెబ్బతినడమే గాక, జలవిద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గి, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. సింధూ నదిపై కట్టిన టర్బేలా, ఝీలం నదిపై కట్టిన మంగ్లా ప్రాజెక్టుల్లో రోజురోజుకూ నీటి మట్టం పడిపోతున్నది.
పాకిస్తాన్లో 80 శాతం వ్యవసాయ భూమి సింధూ నదీ వ్యవస్థ నీటిపై ఆధారపడి ఉంది. 2024, జూన్తో పోలిస్తే 2025, జూన్ 2 నాటికి సింధూ రివర్ సిస్టమ్లో నీళ్లు 10.30 శాతం పడిపోయినట్లు పాకిస్తాన్ గవర్నమెంట్ డేటా రిలీజ్ చేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే.. మరిన్ని ఇబ్బందులు తప్పవు. నైరుతి రుతుపవనాలు వచ్చేందుకు ఇంకా కనీసం 4 వారాల టైమ్ ఉంది. 2025, జూన్ 2 నాటికి పంజాబ్ ప్రావిన్స్లో మొత్తం నీటి లభ్యత 1,28,800 క్యూసెక్కులు ఉంది.
నిరుడు జూన్తో పోలిస్తే 14,800 క్యూసెక్కులు తక్కువ అని ఇస్లామాబాద్కు చెందిన ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (ఐఆర్ఎస్ఏ) తెలిపింది. తీవ్రమైన నీటి కొరత కారణంగా ఖరీఫ్ సీజన్లో రైతులకు గడ్డుపరిస్థితులే ఎదురవుతాయి. నైరుతి రాక ఆలస్యానికితోడు ఎండ కారణంగా నీటి వనరులు మరింత అడుగంటే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఎండాకాలంలో 21 శాతం నీటి కొరత ఉంటుందని డ్యామ్ నిర్వహణ అధికారులు, ఇరిగేషన్ సప్లై మానిటరింగ్ ఏజెన్సీలు మేలోనే హెచ్చరించాయి.
సింధూ నదీ బేసిన్ నీటి ప్రవాహంలో 21 శాతం కొరత, 2 కీలక ప్రాజెక్టుల్లో 50 శాతం నీటి నిల్వల షార్టేజ్ ఏర్పడినట్లు ఐఆర్ఎస్ఏ తాజా అంచనాలు సూచిస్తున్నాయి. నీటి వనరులు భారీగా పడిపోతున్నాయని, కూరగాయలు ఎండిపోతున్నాయని పంజాబ్ ప్రావిన్స్ రైతు తెలిపాడు. వాటర్ సప్లై పూర్తిగా నిలిచిపోతే.. పాకిస్తాన్ మరో థార్ ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.