- బియ్యం, ఉప్పుపప్పుల ఖర్చును లెక్కేసిన పీఆర్సీ
- కనీస వేతనం రూ.19 వేలకు ప్రాతిపదిక ఇదే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ముగ్గురు ఉండే ఫ్యామిలీ నెలవారీ ఖర్చును రూ.16,452 గా పీఆర్సీ కమిటీ తన రిపోర్ట్ లో పేర్కొంది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇచ్చిన డేటా ఆధారంగా ఈ లెక్కను రిపోర్టులో పెట్టింది. ఈ ఖర్చును ఆధారంగా చేసుకుని.. ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలు ఉండాలని సిఫార్సు చేసింది. అయితే ఇందులో 2018 జూలై 1 నాటి రేట్లను పేర్కొన్నారు. ఆ ధరలకు ప్రస్తుతమున్న రేట్లకు చాలా తేడా ఉంది. ఈ రెండున్నరేళ్లలో ప్రతి వస్తువు కూడా 10 శాతం దాకా రేటు పెరిగింది. అయినా అప్పటి రేట్లతోనే సిఫార్సులు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
చాలా లెక్కలు మారాయి
పీఆర్సీ రిపోర్టులో కేజీ కూరగాయల ధరను సగటున రూ.45గా పేర్కొన్నారు. కానీ కూరగాయలు ఎక్కువగా పండే సీజన్ లో తప్ప.. ఏడాది పొడవునా కూరగాయలేవీ కిలో రూ.60కన్నా తక్కువకు రావడం లేదు. ఇక కిలో ఉల్లిగడ్డ రేటు రూ.21గా చెప్పారు. కానీ ఏడాదిలో చాలా రోజులు ఉల్లిరేటు కిలో రూ.40 పైనే పలుకుతోంది. లీటర్ పాల రేటు రూ.55గా పేర్కొనగా.. ఇప్పుడు రూ.70వరకు ఉంది. చికెన్, మటన్, ఎగ్స్ రేట్లలోనూ తేడా ఉంది. రెండున్నరేళ్ల క్రితం మటన్ రేటు కిలో రూ.450 ఉండగా.. ఇప్పుడు రూ.700కు పెరిగింది. గుడ్లు కూడా ఒక్కోటీ నాలుగున్నరకు దొరికేవి ఇప్పుడు ఆరు రూపాయలు ఉన్నాయి.
For More News..