రోమ్: ఇటలీలోని ఒకవైపునకు వంగి ఉన్న ప్రముఖ పీసా టవర్ను ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు. వంపుగా ఉన్న ఈ టవర్ ఎప్పుడు కూలిపోతుందోనని దశాబ్దాలుగా ఇంజనీర్లు, చరిత్రకారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో టవర్ను నిటారుగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2001 నుంచి ఇప్పటి వరకు ఈ టవర్ 1.6 ఇంచులు (4 సెం.మీ.) నిటారుగా కదిలించినట్లు ఇటీవల నిర్వహించిన సర్వే వెల్లడించింది. 850 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ టవర్.. డిజైన్ లోపం వల్ల ఒకవైపుకు వంగిపోయిందని ఇంజనీర్లు వెల్లడించారు.
1173లో ప్రారంభమైన ఈ టవర్ నిర్మాణం అనేక కారణాల వల్ల 1319లో పూర్తయింది. నిర్మాణం పూర్తయిన కొన్నేండ్ల తర్వాత ఈ టవర్ నిదానంగా ఒకవైపునకు ఒరగడం స్టార్ట్ అయింది. భూగర్భంలో కేవలం మూడు మీటర్ల లోతులోనే పునాది ఉండటం, ఈ టవర్ను నిర్మించిన భూ భాగం నిర్మాణానికి అనువులేక పోవడంతో ఇది ఒకవైపునకు ఒరిగిందని ఇంజనీర్లు పేర్కొన్నారు. దీంతో చాలా ఏండ్ల నుంచి దీన్ని నిలబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే గత 20 ఏండ్లుగా జరుగుతున్న టవర్ పనుల వల్ల 1.6 ఇంచులు నిటారుగా నిలబడినట్టు ఒపెరా ప్రిమజియాలే డెల్లా పిసానా (ఓపీఏ) ఫండింగ్ ఇచ్చిన సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
