
సినీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. నిర్మాతల వైఖరిపై ఆదివారం (ఆగస్టు 10) వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడుతున్నారు. నిర్మాతలు సూచించిన పర్సెంటేజీ విధానాన్ని అంగీకరించని ఫెడరేషన్.. భారీ ఆందోళనలకు దిగింది. దీంతో 7వ రోజు కూడా ఎక్కడి షూటింగ్ లు అక్కడే ఆగిపోయాయి.
టాలీవుడ్లో వారం రోజులుగా సమ్మె జరుగుతోంది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ శనివారం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో కృష్ణానగర్లో ఆదివారం సినీ కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నిరసనలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొననున్నారు.
ఫెడరేషన్ సభ్యులతో చర్చలు జరిపిన అనంతరం నిర్మాతలు సూచించిన పర్సెంటేజీ విధానాన్ని ఫెడరేషన్ అంగీకరించలేదు. నిర్మాతలు యూనియన్లను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫెడరేషన్ ఆరోపిస్తోంది. టీజీ విశ్వప్రసాద్ తీరుపై నిరసన చేపడుతున్నారు. ఇవాళ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.
తొలి ఏడాది 15, రెండో ఏడాది 5, మూడో ఏడాది 5 శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. రోజుకు వెయ్యి రూపాయల వేతనం ఉన్నవారికి తొలి ఏడాది 20 శాతం పెంచాలని నిర్మాతలు నిర్ణయించారు. మూడో ఏడాది 5 శాతం పెంచేందుకు నిర్మాతలు సుముఖత వ్యక్తం చేశారు. 2 వేల రూపాయలకు పైగా ఉన్న కార్మికులకు వేతనాలు పెంచలేమని నిర్మాతలు తేల్చి చెప్పారు. చిన్న సినిమాలకు పాత విధానంలో వేతనాలు చెల్లిస్తామని తెలిపారు.
వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు వ్యతిరేకించారు. నిర్మాతల నిర్ణయాన్ని అంగీకరించమని, ఫెడరేషన్ను విభజించేలా వేతనాల నిర్ణయం ఉందని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆరోపించారు. రోజువారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకు ఒకే విధంగా వేతనాలు పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. నిర్మాతలు విధించిన 4 షరతులకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని ఫిల్మ్ ఫెడరేషన్ కుండబద్ధలు కొట్టింది.
యూనియన్ల ఐక్యతను దెబ్బతీసేలా నిర్మాతల నిర్ణయాలు ఉన్నాయని, రేపటి (ఆదివారం) నుంచి తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకత్వం స్పష్టం చేసింది. ఇలా.. నిర్మాతలకు, ఫిల్మ్ ఫెడరేషన్కు మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో టాలీవుడ్ షూటింగ్స్ బంద్ ఎప్పటివరకూ కొనసాగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి.