
కీవ్ : యూఎన్, టర్కీ మధ్యవర్తిత్వంలో జరిగిన ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్కు చెందిన ఓడ సోమవారం ఒడెసా పోర్ట్ నుంచి బయలుదేరింది. రష్యాతో యుద్ధం మొదలైనంక ఉక్రెయిన్ నుంచి బయల్దేరిన తొలి కార్గో షిప్ ఇదే. సియెర్రా లియోన్ జెండాతో కార్గో షిప్ రజోనీ.. ఒడెసా నుండి 26,000 టన్నుల మొక్కజొన్నతో లెబనాన్కు బయలుదేరింది. రష్యా దాడి మొదలైన తర్వాత ఇన్నిరోజులకు దేశం నుంచి ఓ కార్గో షిప్ బయటికి వెళ్లిందని ఉక్రెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ ఒలెక్సాండర్ కుబ్రకోవ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. మొక్కజొన్న ఎగుమతి చేసే నాలుగవ అతిపెద్ద దేశం ఉక్రెయిన్ అని వివరించారు. పోర్టు ద్వారా ఎగుమతి చేసిన మొక్కజొన్నతో.. ప్రపంచంలో నెలకొన్న ఆహారం సంక్షోభ తీవ్రత కొంత తగ్గే చాన్స్ ఉందన్నారు.
ఉక్రెయిన్ తన పార్టనర్స్తో కలిసి ప్రపంచం ఆకలిని తగ్గించేందుకు ముందడుగు వేసిందని తెలిపారు. ఉక్రెయిన్ నుంచి షిప్ బయలుదేరడం చాలా పాజిటివ్ అని మాస్కోలోని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. రజోనీ.. మంగళవారం మధ్యాహ్నం కల్లా ఇస్తాంబుల్లోని బోస్పోరస్ వద్దకు చేరుకుంటుందని టర్కీ డిఫెన్స్ మినిస్టర్ హులుసీ అకర్ తెలిపారు. లెబనాన్ ఎక్కువగా ఉక్రెయిన్ నుండి గోధుమలను దిగుమతి చేసుకుంటుంది. మొక్కజొన్నను వంట నూనె, గడ్డి తయారీకి కొనుగోలు చేస్తుంది.