న్యూఢిల్లీ: గ్లోబల్గా ఫైనాన్షియల్ సెక్టార్ ప్రమాదంలో ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా అన్నారు. ప్రభుత్వాలు వేగంగా చర్యలు తీసుకోవడం వలన బ్యాంకింగ్ క్రైసిస్ కొంత కుదుటపడినా, అనిశ్చితి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. బీజింగ్లో చైనా డెవలప్మెంట్ ఫోరమ్తో ఆమె ఈ విషయాలు పంచుకున్నారు. అప్పులు ఎక్కువగా ఉండడం, దీర్ఘ కాలం పాటు తక్కువ వడ్డీ రేట్లు ఉండి షార్ట్ టర్మ్లోనే హయ్యర్ వడ్డీ రేట్లకు మారడం వంటి అంశాలతో గ్లోబల్ ఫైనాన్షియల్ సెక్టార్పై ఒత్తిడి పెరుగుతోందని, ఈ సెక్టార్ వీక్గా మారుతోందని జార్జీవా అభిప్రాయపడ్డారు.
ఇన్ఫ్లేషన్ను ఎదుర్కోవడానికి వడ్డీ రేట్లు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. యూఎస్, యూరప్లోని బ్యాంకులు దివాలా బాటపడుతుండడమే ఇందుకు నిదర్శనమని వివరించారు. అలానే తక్కువ ఆదాయ దేశాలపై ఫోకస్ పెట్టామని, ముఖ్యంగా ఎక్కువగా అప్పులు చేసిన దేశాలను గమనిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, యూఎస్లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలా తీయగా, స్విస్ బ్యాంక్ క్రెడిట్ స్వీస్ను యూబీఎస్ టేకోవర్ చేయాల్సి వచ్చింది. సిగ్నేచర్ బ్యాంక్, ఫస్ట్ రిపబ్లిక్ వంటి బ్యాంకులూ దివాలా తీయొచ్చు. తాజాగా డాయిచ్ బ్యాంక్పైనా అనుమానాలు పెరిగాయి. గ్లోబల్గా బ్యాంక్ షేర్లు పడుతున్నాయి.
కొంత కుదుటపడినా..
ఫైనాన్షియల్ స్టబిలిటీ దెబ్బ తినకుండా చూసుకునేందుకు ప్రభుత్వాలు వేగంగా స్పందిస్తున్నాయని జార్జీవా అన్నారు. కాగా, క్రెడిట్ స్వీస్ను యూబీఎస్ టేకోవర్ చేయడం ఒక్క రోజు ఆలస్యమైనా, గ్లోబల్గా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేదని స్విట్జర్లాండ్ ఫైనాన్స్ మినిస్టర్ కరిన్ కెల్లర్ సట్టర్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు బ్యాంకులకు ఫెడ్ భారీగా లిక్విడిటీ అందిస్తోంది. బ్యాంకింగ్ క్రైసిస్ను ఆపాలని ప్రయత్నాలు చేస్తోంది. ‘ఈ చర్యలన్నీ సంక్షోభాన్ని కొంత వరకు ఆపగలిగాయి. కానీ, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని జార్జీవా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చైనా ఎకానమీ స్ట్రాంగ్గా ఉందని, వరల్డ్ ఎకానమీల్లో చైనా ద్రువ తారగా వెలుగుతోందని అన్నారు.
గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా..
గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కూడా రికవరీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పరిస్థితులన్నీ బాగుంటాయని అనుకున్నా గ్లోబల్ జీడీపీ గ్రోత్ ఈ ఏడాది, వచ్చే ఏడాది లాంగటర్మ్ యావరేజ్ 3.8 శాతం కంటే దిగువనే ఉంటుందని జార్జీవా అంచనావేశారు. ఓవరాల్గా ఎకానమీ బలహీనంగా ఉందని అన్నారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డామని అనుకున్నలోపే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్నారు. ఈ యుద్ధం వలన గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 3 శాతం దిగువకు పడిపోయిందని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2.9 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.
మరోవైపు చైనా ఎకానమీ గ్రోత్ ఈ ఏడాది 5.2 శాతంగా ఉంటుందని పేర్కొంది. కరోనా రిస్ట్రిక్షన్ల ఎత్తేయడంతో ప్రైవేట్ సెక్టార్ వినియోగం పుంజుకుంటోందని వివరించింది. చైనా ఎకానమీ గ్లోబల్ ఎకానమీకి సపోర్ట్గా ఉంటుందని జార్జీవా అభిప్రాయపడ్డారు. గ్లోబల్ ఎకానమీ గ్రోత్లో మూడో వంతు చైనా నుంచి ఉంటోందని అన్నారు. ‘చైనా జీడీపీ గ్రోత్ ఒక శాతం పెరిగితే, మిగిలిన ఆసియా దేశాల ఎకానమీ సగటున 0.3 శాతం పెరుగుతుంది.
చైనా ఎకానమీ రికవరీ అవ్వడం ముఖ్యం’ అని అన్నారు. వినియోగ ఆధారిత ఎకానమీపై చైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని సలహా ఇచ్చారు. ఫలితంగా ఎనర్జీ వాడకం తగ్గుతుందని, క్లయిమేట్ చేంజ్ గోల్స్ను చేరుకోవడానికి వీలుంటుందని వివరించారు. చైనా తన ప్రొడక్టివిటీని పెంచాలని అన్నారు. ప్రైవేట్ సెక్టార్, ప్రభుత్వ కంపెనీలు సమాన స్థాయిలో పోటీపడేలా చేయడానికి అనుకూలమై రీఫామ్స్ తీసుకురావాలని సలహా ఇచ్చారు. ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్లు పెంచితే ఎకానమీలో ప్రొడక్టివిటీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
