హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళా యూనివర్సిటీని సర్కారు పట్టించుకోవడం లేదు. నెలన్నర కింద కోఠి విమెన్స్ కాలేజీని మహిళా వర్సిటీగా అప్గ్రేడ్ చేసింది. ఆ తర్వాత దాని గురించి మరిచిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయినా ఇప్పటికీ ఆ యూనివర్సిటీ పర్యవేక్షణకు వైస్చాన్స్లర్ను గానీ, స్పెషల్ ఆఫీసర్ను గానీ ప్రభుత్వం నియమించలేదు.
హడావుడి చేసి మర్చిపోయారు
మహిళా యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలని సర్కార్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అప్గ్రేడ్ జీవోతో పాటు గెజిట్ కూడా సర్కారు రిలీజ్ చేసింది. ఈ ప్రక్రియ అంతా ఏప్రిల్ లోనే పూర్తయింది. ఈ సారి బడ్జెట్లో ప్రభుత్వం రూ.వంద కోట్లు పెట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలనీ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత నుంచి వర్సిటీ గురించి ఊసెత్తడమేలేదు. కానీ ఈ 2022–23 విద్యాసంవత్సరం మాత్రం పాత కోర్సులతోనే ప్రారంభమవుతోంది. రెండ్రోజుల కింద విడుదలైన సీపీగెట్ నోటిఫికేషన్లో కోఠి ఉమెన్స్ కాలేజీలోని పాత కోర్సులనే కొనసాగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
వీసీ, ఇతర సిబ్బంది నియామకాల్లేవ్
వర్సిటీకి వీసీ, రిజిస్ట్రార్ కీలకమైన పోస్టులు. మహిళా యూనివర్సిటీగా ప్రకటించినా ఇప్పటికీ ఆ రెండు పోస్టుల్లో ఎవ్వరినీ నియమించలేదు. కనీసం ఎవరికైనా వీసీగా ఇన్చార్జీ బాధ్యతలూ అప్పగించలేదు. దీంతో వర్సిటీకి సంబంధించిన కీలకమైన పనులు పెండింగ్లో పడ్డాయి. అయితే అప్పట్లో ఓయూ వీసీ రవీందర్కు ఇన్చార్జీ బాధ్యతలు ఇచ్చి, ఓ ఐఏఎస్ ఆఫీసర్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తారనే ప్రచా రం జరిగింది. కానీ ఇప్పటికీ నెలన్నర అవుతున్నా, ఆ ఊసే లేదు. ప్రస్తుతం వర్సిటీకి అవసరమైన సిబ్బందిని కూడా తీసుకోవలేదు. మరోపక్క ప్రస్తుతం విమెన్స్ కాలేజీలో పనిచేస్తున్న స్టాఫ్కూ అక్కడే కొనసాగే ఆప్షన్కూడా ఇవ్వాలని గతంలో నిర్ణయించినా, ఇప్పటికీ అది అమలు కాలేదు. అయితే వర్సిటీకి ప్రత్యేకంగా వీసీ ఉంటే పాలన, పనులు సరిగా జరుగుతాయని ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు.