- సెకండరీ హెల్త్కేర్గా మారుస్తూ సర్కారు నిర్ణయం
- అటానమస్ హోదా రద్దు.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- ఇక వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు జీతాల తిప్పలు తప్పినట్టే
- రాష్ట్రవ్యాప్తంగా 184 హాస్పిటల్స్కు మహర్దశ
- సీఎం రేవంత్, మంత్రి దామోదరకు డాక్టర్లు, నర్సుల కృతజ్ఞతలు
హైదరాబాద్, వెలుగు: ఇన్నాళ్లు అటానమస్ పేరుతో సాగుతున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (డీఎస్హెచ్)ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో డీఎస్హెచ్ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. దీంతో టీవీవీపీ పరిధిలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ ఇకపై నేరుగా ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానున్నాయి. బడ్జెట్ నుంచి జీతాల దాకా అన్నింటికీ లైన్ క్లియర్ అయ్యింది. కాగా, టీవీవీపీపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) నిపుణులతో స్టడీ చేయించారు. డైరెక్టరేట్గా మార్చాల్సిందే అని నివేదిక రావడంతో.. విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. డైరెక్టరేట్గా మార్చితేనే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని వివరించారు. దీంతో సీఎం సానుకూలంగా స్పందించి కేబినెట్లో బిల్లుకు ఓకే చెప్పారు.
ఉద్యోగుల వెతలు తీరినట్టే..
ఉమ్మడి రాష్ట్రంలో 1986లో ఈ వైద్య విధాన పరిషత్ (అప్పట్లో ఏపీవీవీపీ) ఏర్పడింది. రాష్ట్రం విడిపోయాక టీవీవీపీగా మారింది. దీని కింద ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 184 కమ్యునిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్సీ), ఏరియా, జిల్లా హాస్పిటళ్లు నడుస్తున్నాయి. పీహెచ్సీలకు, పెద్ద టీచింగ్ హాస్పిటల్స్కు మధ్య వారధిలా ఉండేవి ఇవే. అయితే సంస్థకు అటానమస్ హోదా ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగుల్లాగా వీళ్లకు సమయానికి జీతాలు వచ్చేవి కాదు, ఈహెచ్ఎస్ (హెల్త్ కార్డులు) వర్తించకపోయేవి. దీంతో డాక్టర్లు ఈ హాస్పిటల్స్లో చేరాలంటేనే వెనకడుగు వేసేవారు. పక్కనున్న ఏపీలో ఎప్పుడో దీన్ని మార్చేశారు. మన దగ్గర కూడా మార్చాలని ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
మారనున్న హాస్పిటల్స్ రూపురేఖలు
తాజా నిర్ణయంతో టీవీవీపీ పరిధిలోని హాస్పిటల్స్కు ఇక నేరుగా ట్రెజరీ నుంచే నిధులు వస్తాయి. దీంతో ఫండ్స్ కొరత తీరుతుంది. పరిపాలనలో పారదర్శకత పెరుగుతుంది. ఒక్కో జిల్లాలో సగటున 4 నుంచి 6 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇకపై డాక్టర్లు, స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగులుగా ధీమాగా పనిచేస్తారు కాబట్టి.. పేదలకు అందే వైద్య సేవలు కూడా మెరుగుపడతాయని టీవీవీపీ ఆఫీసర్లు చెప్తున్నారు. సర్కారు నిర్ణయాన్ని ప్రభుత్వ డాక్టర్ల సంఘం (టీజీజీడీఏ) స్వాగతించింది. తమ పోరాటానికి ఫలితం దక్కిందని అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ బి. నరహరి, సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయం ప్రజారోగ్య వ్యవస్థలో మైలురాయిగా నిలుస్తుందని టీపీసీసీ డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ ఎం. రాజీవ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి దామోదరకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ కూడా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
