35 ఏళ్లు నిండిన వాలంటీర్లు ఇంటికే..

35 ఏళ్లు నిండిన వాలంటీర్లు ఇంటికే..
  • ఉత్తర్వులు జారీచేసిన సంస్థ కమిషనర్‌
  • జిల్లాలో వందల సంఖ్యలో వలంటీర్లకు ఇక ఉద్వాసనే
  • మూణాళ్ల ముచ్చటగా ముగియనున్న వలంటీర్ల సేవలు

ఏపీలో 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 18 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారితోపాటు 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వాలంటీరు సచివాలయం, వార్డు వాలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ జీఎస్‌. నవీన్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాల పథకాల అమలులో భాగంగా సంక్షేమ లబ్ధిని ఇంటింటికీ అందించే లక్ష్యంతో హడావుడిగా వాలంటీర్ల పోస్టులను భర్తీ చేశారు.  50 ఇళ్లకు ఒక వలంటీరును నియమిస్తూ రాష్ట్రంలో 2.60 లక్షల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు.  ఈ సంఖ్య జిల్లాలో 30 వేలకు పైబడే ఉంది. వీరంతా అధికార వైసీపీ గ్రామ, మండలస్థాయి నాయకులతో పాటు ఎమ్మెల్యేల సిఫారసులతో నియమితులైన వారే అత్యధికంగా ఉన్నారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 35 ఏళ్లు నిండిన వాలంటీర్ల నియామకం జరిగిన దృష్ట్యా వారిని విధుల నుంచి తొలగించాలని, ఆ ఖాళీల భర్తీకి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు ఖచ్చితంగా అమలైతే జిల్లాల్లో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 35 సంవత్సరాల వయస్సు దాటిన వారి సంఖ్య వందల్లో ఉండే అవకాశం ఉంది.నిబంధనలు అనుసరించి 35 సంవత్సరాలు దాటి ఒక్కరోజు ఉన్నా సరే సదరు వాలంటీరును ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది.