
హైదరాబాద్ : డ్రైనేజీలు, మురుగు కాలువలు క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన మాన్యువల్ స్కావెంజర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఇటీవల దాఖలైన పిల్ను హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ విజయ్ భాస్కర్ రెడ్డిల బెంచ్ గురువారం విచారించింది. ప్రభుత్వం శానిటేషన్ కార్మికులను నిర్లక్ష్యం చేస్తోందని పిటిషనర్ తరఫు లాయర్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లోని డ్రైన్లను శుభ్రం చేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు మాత్రమే జీహెచ్ఎంసీ పరిహారం చెల్లిస్తోందన్నారు. సఫాయి కర్మచారి ఆందోళన కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలవడం లేదన్నారు. జీహెచ్ఎంసీ తరఫు లాయర్ స్పందిస్తూ.. కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కావాలని కోరారు. వాదనలు విన్న కోర్టు.. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఆదేశించింది. డ్రైనేజీలను మాన్యువల్గా క్లీన్ చేసే కార్మికులు ఎంత మంది ఉన్నారో లెక్క తీయాలంది.