రాజ్ భవన్ కాదు..ఇది ప్రజా భవన్

రాజ్ భవన్ కాదు..ఇది ప్రజా భవన్

హైదరాబాద్, వెలుగు‘‘తమిళనాడు కూతురిగా.. తెలంగాణ సోదరిగా.. ఇక్కడి ప్రజలకు గవర్నర్ గా సేవ చేయడం పట్ల నాకు గర్వంగా ఉంది’’ అని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. ఏడాది పదవీ కాలంలో తెలంగాణ ప్రజలు తన మీద చూపిన ప్రేమ, ఆప్యాయతలకు సెల్యూట్  చేస్తున్నానన్నారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తన ప్రసంగాన్నితొలుత తెలుగులో ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ గ్రీటింగ్స్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడమంటే తనకిష్టమని తెలిపారు. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం చారిత్రాత్మక పోరాటం చేసి.. రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలకు నమస్కరిస్తున్నానని ఆమె అన్నారు.

హైదరాబాద్ బిర్యానీ టేస్ట్‌‌‌‌తోపాటు తెలంగాణ నాన్ వెజ్ వంటకాలను ఆస్వాదిస్తున్నానని గవర్నర్ చెప్పారు. తాను ఉండేది రాజ్ భవన్ కాదని, దానిని ప్రజలు ప్రజాభవన్‌‌గా భావించాలన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, గిరిజన సంక్షేమమే తన ప్రాధాన్యాంశాలని, ఏడాది కాలంలో వీటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు గవర్నర్ తెలిపారు. ఒక డాక్టర్‌‌‌‌గా బ్లడ్ డొనేషన్‌‌ను  ప్రోత్సహించానని, కరోనా నివారణ చర్యలపై స్పందించానని చెప్పారు.  గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటించానని గవర్నర్‌‌‌‌ గుర్తు చేసుకున్నారు.

నేను చెప్పాకే.. జిల్లాకో కరోనా ఆస్పత్రి.. 

కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించగా.. ఈ విషయంలో తాను చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని బదులిచ్చారు. కరోనా చికిత్సకు ప్రభుత్వం ఒకటే ఆస్పత్రి చాలనుకుందని, కానీ తాను చెప్పాక జిల్లాకో ఆస్పత్రిని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో పేదలకు కరోనా ట్రీట్​మెంట్​ అందించేందుకు ఆయుష్మాన్​ భారత్​ స్కీమ్​లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్​ సూచించారు. ఓ డాక్టర్​గా ఈ సూచన చేస్తున్నానన్నారు. గవర్నర్‌‌గా తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రికి, సహకరిస్తున్న సీఎం కేసీఆర్‌‌‌‌కు ఆమె థ్యాంక్స్ చెప్పారు. అనంతరం తన ఏడాది పాలనపై ఈ–బుక్‌‌ను గవర్నర్ విడుదల చేశారు. తనను సంప్రదించాలనుకునే వారు వెబ్‌‌సైట్ లో సూచించిన ఈ – మెయిల్ ద్వారా అపాయింట్‌‌మెంట్ కోరవచ్చని గవర్నర్‌‌‌‌ సూచించారు.