- నవీన్ మిట్టల్, సందీప్కుమార్ ఝాలపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: తాము ఉత్తర్వులిచ్చిన తరువాత అధికారులు బదిలీపై వెళ్లినా వాటిని అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. 15 ఏండ్ల కింద మిడ్మానేరు ప్రాజెక్ట్ కోసం సేకరించిన స్థలానికి 3 నెలల్లో పరిహారం చెల్లిస్తామంటూ హామీ ఇచ్చి అమలు చేయకపోవడంపై అప్పటి రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, అప్పటి సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝాలపై హైకోర్టు మండిపడింది.
దీనిపై మార్చి 24న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. 74 ఏండ్ల వృద్ధురాలికి 8 వారాల్లో పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. తన 2783 చదరపు గజాల స్థలానికి పరిహారం ఇస్తామని అధికారులు కోర్టుకు హామీ ఇచ్చి 17 నెలలైనా చెల్లించలేదని రామవ్వ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ శ్రవణ్ కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు.
