
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాల పేరిట ప్లాస్టిక్ను ఎక్కువగా వాడుతున్నారని, దాన్ని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఈ అంశంపై ఇప్పటిదాకా ఎన్ని కేసులు నమోదు చేశారో, ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కాలుష్య నియంత్రణ మండలిని (పీసీబీ) ఆదేశించింది. గణపతి విగ్రహాలకు ప్లాస్టిక్ కవర్లు చుట్టి తీసుకెళ్లకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఎల్బీ నగర్కు చెందిన మురళి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. గురువారం ఆ పిటిషన్ను చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఏ అభిషేక్రెడ్డిల డివిజన్ బెంచ్ విచారించింది. వీధివీధిలో వినాయకుడి మండపాలను ఏర్పాటు చేసి విగ్రహాలను పెడుతుంటారని, వాటికి ప్లాస్టిక్ కవర్లను చుట్టి తీసుకొస్తే ఆ తర్వాత ఎదురయ్యే పర్యావరణ ముప్పు దారుణంగా ఉంటుందని పిటిషనర్ తరఫు లాయర్ పవన్కుమార్ వాదించారు. కవర్లు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటాయని, భూగర్భజలాలు పెరగకుండా అవి అడ్డుకోవడంతో పాటు మొక్కలు పెరగకుండా చేస్తాయని వివరించారు. ప్లాస్టిక్ వల్ల చేపలు, పక్షులు, ఆవులు, ఇతర జంతువుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందన్నారు. 50 మైక్రాన్ల సైజు కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ను వాడొద్దని చట్టంలో ఉన్నా ఇష్టానుసారంగా వాడేస్తున్నారన్నారు. ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.